TS Eamcet 2022: రేపు తెలంగాణ ఎంసెట్‌-2022 రెండో విడత కౌన్సిలింగ్.. ఐనా కొలిక్కిరాని ఫీజుల లొల్లి!

రెండో విడత కౌన్సిలింగ్ రేపట్నుంచి ప్రారంభమై అక్టోబర్ 16 వరకు సీట్ల కేటాయింపు జరిగే సమయానికి కుడా జీవో వస్తుందో? రాదో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా పడుతుందా అన్న సందేహం కూడా లేకపోలేదు. ఇలా జరిగితే..

TS Eamcet 2022: రేపు తెలంగాణ ఎంసెట్‌-2022 రెండో విడత కౌన్సిలింగ్.. ఐనా కొలిక్కిరాని ఫీజుల లొల్లి!
TS EAMCET 2nd Counselling
Follow us

|

Updated on: Oct 10, 2022 | 7:10 PM

తెలంగాణ ఇంజినీరింగ్ ఫీజుల పంచాయతీ ఇంకా తేలలేదు. ఇప్పటికే ఫస్ట్‌ రౌండ్‌ కౌన్సిలింగ్ ముగిసింది. మంగళవారం నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతున్నా ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. దీంతో పాత ఫీజులతోనా లేదా కొత్త ఫీజులతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా? అనే సందేహం విద్యార్థుల్లో మెదులుతూనే ఉంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ అక్టోబర్ 3 కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి నివేదిక తయారు చేసింది. దానిని ప్రభుత్వానికి అందజేశాయి. సర్కారు ఆమోదముద్రతో జీవో వచ్చిన తర్వాత కొత్త ఫీజులు అమల్లోకి రాబోతున్నాయి.

ఇష్టాను సారంగా ఫీజులు వసూలు చేస్తోన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు.. నోరు మెదపని సర్కార్!

ఈ క్రమంలో ఎఫ్ఆర్సీ చర్చల్లో పలు కాలేజీలు ఫీజుల పెంపుపై తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. 2019లో నిర్ణయించిన ఫీజుల తర్వాత ఈ ఏడాది పెంపు యథావిధిగా జరగాల్సిందేనని 20కి పైగా కాలేజీలు పట్టుబట్టినట్లు సమాచారం. కోవిడ్ కారణాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్ధనలు, ఆడిట్‌ల ఆధారంగా ఫీజుల పెంపును నిర్ణయించాలని ఎఫ్ఆర్సీ భావించింది. అందుకు తగ్గట్లు జులైలో జరిగిన ఎఫ్ఆర్సీ ఆడిట్ పరిశీలించి కాలేజీల వారిగా ఫీజులు నిర్ణయించింది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా జీవో విడుదలవ్వకపోవడంతో మొదటి విడత కౌన్సిలింగ్‌కు పాత ఫీజులు కాదని, కొత్తవాటికి అనుమతి ఇవ్వాలని 81 కాలేజీలు కోర్టుకెల్లి ఫీజుల పెంపునకు అనుగుణంగా అనుమతులు తెచ్చుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 36 ఇంజినీరింగ్ కాలేజీల్లో వార్షిక ఫీజు లక్ష రూపాయలు దాటింది. సీబీఐటీలో రూ.1.73లక్షలు, వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోజి రూ.1.50లక్షలు, ఎంవీఎస్ఆర్ రూ.1.45 లక్షలు చొప్పున కొత్త ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిపై విద్యార్థి సంఘాలు కూడా గళమెత్తాయి. పెంచిన ఇంజీనీరింగ్ ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేసిన ఫలితం లేకుండా పోయింది. మొదటి విడత కౌన్సిలింగ్ ఈ ఫీజులతోనే గడిచిపోయింది.

ఎంతకీ తెగని ఫీజుల లొల్లి..

ఇక రేపు రెండో విడత కౌన్సిలింగ్ సమయానికైనా ప్రభుత్వం ఫీజుల పెంపుపై జీవో ఇస్తుందని భావించినా అది రాలేదు. ఫీజు రెగ్యూలేటరి కమిటీ నివేదికను ఆమోదిస్తేనే జీవో రానుంది. దీంతో రెండో విడత కౌన్సిలింగ్ కూడా కాలేజీలు ఇష్టానుసారం పెంచుకున్న ఫీజులతోనే సాగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. రెండో విడత కౌన్సిలింగ్ రేపట్నుంచి ప్రారంభమై అక్టోబర్ 16 వరకు సీట్ల కేటాయింపు జరిగే సమయానికి కుడా జీవో వస్తుందో? రాదో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా పడుతుందా అన్న సందేహం కూడా లేకపోలేదు. ఇలా జరిగితే తదుపరి కౌన్సిలింగ్‌లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున మొదటి విడతలానే దీన్ని కొనసాగిస్తారని సాంకేతిక విద్య విభాగం అధికారులు అంటున్నారు. కొత్త జీవో రానంత వరకు 2019లో అధికారికంగా నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. కానీ కాలేజీలు ఎఫ్‌ఆర్సీతో జరిపిన చర్చల మూలంగా కొత్త ఫీజులను వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నుంచి క్లారిటీ లేకపోవడంతో ఇంజినీరింగ్ ఫీజుల లొల్లి గందరగోళంగా మారింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వంతోపాటు, ఫీ రెగ్యులేటరీ కమిటీ తీరుపై టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, స్టూడెంట్ లీడర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు నిర్ణయించకపోతే ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తాయని, పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఫీజులు ఖరారు కాకుండా కౌన్సిలింగ్ నిర్వహించడంపై కూడా టెక్నికల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ మండిపడుతోంది.

(విద్యా సాగర్, టీవీ 9 రిపోర్టర్)