Supreme Court: సర్కార్ బడి టీచర్లకు షాక్.. TETపై వెనక్కి తగ్గని సుప్రీంకోర్టు! కొత్త డెడ్ లైన్ ఇదే
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టెట్పై దాఖలైన సమీక్ష పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించేందుకు టెట్ అర్హత గడువు పొడిగించింది..

న్యూఢిల్లీ, మే 31: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)ను విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన సమీక్ష పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అయితే టెట్ అర్హత సాధించేందుకు ఉపాధ్యాయులకు ఇచ్చిన గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఉపాధ్యాయుల సేవల కంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.
2009లో విద్యా హక్కు చట్టం (RTE) అమల్లోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హతను తప్పనిసరిగా పొందాలని గతంలో 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. పదవీ విరమణకు ఐదేళ్లకు పైగా సమయం ఉన్న ఉపాధ్యాయులు నిర్దిష్ట గడువులోపు టెట్ ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగంలో కొనసాగేందుకు అర్హులు కాదని తెలిపింది. అలాగే పదోన్నతులు కోరుకునే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్లో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగత ఉపాధ్యాయులు కలిపి సుమారు 70 సమీక్ష పిటిషన్లు దాఖలు చేశారు. టెట్ను ఇన్సర్వీస్ టీచర్లకు తప్పనిసరి చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు వాదించారు.
అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లకు పైగా గడిచిందని, ఈ కాలం టెట్ అర్హత పొందడానికి సరిపోతుందని పేర్కొంది. టెట్ అర్హత లేని ఉపాధ్యాయులను కొనసాగించడం వల్ల రాబోయే తరాల విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని కోర్టు అభిప్రాయపడింది. ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, కేవలం భవిష్యత్తుపై భయాందోళనలు ఉండటం మాత్రమే తీర్పును పునఃసమీక్షించడానికి కారణం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం పిల్లల ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని రూపొందించబడిందని, అందుకే విద్యా ప్రమాణాలను కాపాడేందుకు టెట్ అర్హత ఉపాధ్యాయులకు తప్పనిసరి చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




