కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. JEEలో ఫెయిల్.. IIT మద్రాస్ డైరెక్టర్ జీవిత పాఠం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. జేఈఈలో వైఫల్యం.. ఇవేవీ డాక్టర్ వి. కామకోటి జీవితాన్ని ఆపలేకపోయాయి. ఒకప్పుడు సాధారణ విద్యార్థిగా ఎదుర్కొన్న అపజయాలను ఆయన పట్టుదలతో అధిగమించి, దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్కు డైరెక్టర్గా ఎదిగారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆయన ప్రయాణం ప్రతి విద్యార్థికి ఒక గొప్ప పాఠం చెబుతుంది..

పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితం రాకపోతే చాలా మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ముగిసిపోయిందని ఆత్మహత్యలకు పాల్పడటమో.. వ్యసనాలకు బానిస అవడమో చేస్తుంటారు. ముఖ్యంగా జేఈఈ (JEE) వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విఫలమైతే జీవితంలో ఇక అవకాశాలే లేవన్నట్లు తీవ్ర నిరాశ చెందుతుంటారు. ఇలాంటి వారు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వి కామకోటి జీవిత ప్రయాణం తప్పక తెలుసుకోవాలి. ఒక పరీక్షలో ఎదురైన అపజయం జీవితాన్ని నిర్ణయించదని ఆయన ప్రయాణం నిరూపించింది.
కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. జేఈఈలో ఫెయిల్
విద్యార్థి దశలో డాక్టర్ కామకోటి జేఈఈ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. అంతేకాదు కెమిస్ట్రీలో కేవలం ఒక్క మార్కు మాత్రమే వచ్చిందని ఆయన స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు. అలాంటి వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా అదే విద్యార్థి భవిష్యత్తులో దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్కు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు ఒకప్పుడు తాను ఉత్తీర్ణత సాధించలేకపోయిన జేఈఈ పరీక్షకు ఛైర్మన్గా కూడా వ్యవహరించడం విశేషం. జేఈఈలో విఫలమైన తర్వాత కామకోటి నిరాశ చెందకుండా తన ఇంజినీరింగ్ చదువును ఇతర మార్గాల ద్వారా కొనసాగించారు. అనంతరం ఐఐటీ మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేసి పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. 2001లో ఐఐటీ మద్రాస్లో అధ్యాపకుడిగా చేరిన ఆయన, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సమాచార భద్రత (Information Security) వంటి కీలక రంగాల్లో విశేష పరిశోధనలు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలు జాతీయ ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు.
నేడు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
2022 జనవరిలో డాక్టర్ కామకోటి తన మాతృసంస్థ అయిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందే మైక్రోప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు నాయకత్వం వహించడం, జాతీయ సమాచార భద్రత కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా పనిచేయడం వంటి ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ఫోర్స్కు ఛైర్మన్గా కూడా సేవలందించారు.
పద్మశ్రీ సహా ఎన్నో పురస్కారాలు
డాక్టర్ కామకోటి పరిశోధనలకు, సాంకేతిక రంగానికి అందించిన సేవలకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. డీఆర్డీవో అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డు, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో పాటు, 2026లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇంజినీరింగ్ విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని డాక్టర్ కామకోటి ఎప్పుడూ చెబుతుంటారు. ముఖ్యంగా రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Responsible AI), నైతిక విలువలు, జవాబుదారీతనం, పక్షపాత రహిత సాంకేతికత వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. పరిశ్రమల అనుభవం ఉన్న నిపుణులను నేరుగా తరగతి గదులకు తీసుకురావాలనే ఉద్దేశంతో Faculty of Practice విధానాన్ని కూడా ప్రోత్సహించారు. ఆయన నాయకత్వంలో ఐఐటీ మద్రాస్లో స్టార్టప్లు, డీప్టెక్ పరిశోధనలు, అంతర్జాతీయ విద్యార్థుల చేరిక వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి నమోదైంది.
జేఈఈ అభ్యర్థులకు ఆయన జీవితం ఇచ్చే సందేశం ఏమిటంటే..
ప్రతి సంవత్సరం జేఈఈలో టాపర్లు, ఆల్ ఇండియా ర్యాంకర్లు వార్తల్లో నిలుస్తారు. కానీ డాక్టర్ కామకోటి వంటి వ్యక్తుల జీవిత ప్రయాణం ప్రతి విద్యార్థికి మరింత విలువైన సందేశాన్ని అందిస్తుంది. ఒక పరీక్షలో వచ్చిన తక్కువ మార్కులు, ఒకసారి ఎదురైన అపజయం, వరుస వైఫల్యాలు జీవితాన్ని నిర్ణయించవు. నిరంతరం నేర్చుకోవాలనే తపన, కష్టపడే తత్వం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. కెమిస్ట్రీలో ఒక్క మార్కు వచ్చిన విద్యార్థి… జేఈఈలో విజయం సాధించలేకపోయిన అదే అభ్యర్థి… భవిష్యత్తులో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్గా ఎదిగి, పద్మశ్రీ అందుకోవడం లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విజయగాథగా నిలిచింది.
