CBSE Class 12 Results 2026: ఏ క్షణమైనా సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నట్లు సమాచారం. మంగళవారం (మే 12) సాయంత్రం 4 గంటలకు సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2024, 2025 సంవత్సరాల్లో సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలను మే 13న విడుదల చేయగా.. 2025లో మే 12వ తేదీన ప్రకటించింది..

హైదరాబాద్, మే 12: సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్లు పలు మీడయా సంస్థల కథనాలు వెల్లడించాయి. అయితే బోర్డు ఇంకా ఖచ్చితమైన సమయాన్ని, తేదీని అధికారికంగా ధృవీకరించలేదు. ఫలితాలు పగటిపూట ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉందని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వారి లాగిన్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా దాదాపు 18 లక్షలకుపైగా విద్యార్ధులు 12వ తరగతి పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. సీబీఎస్ఈ అధికారికంగా ఫలితాల తేదీని ప్రకటించనప్పటికీ, ‘సీబీఎస్ఈ బోర్డ్ క్లాస్ 12 ఫలితాలు’ త్వరలో రానున్నాయని ఉమాంగ్, డిజిలాకర్ ఇటీవల సూచించాయి. సాధారణంగా సీబీఎస్సీ ఫలితాలను మే మూడో వారంలో ప్రకటిస్తుంది. గత మూడేళ్లుగా ఫలితాలను మే 12 లేదా 13 తేదీల్లోనే వెల్లడిస్తుంది. ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు పలు ప్లాట్ఫారమ్ల ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్తోపాటు డిజిలాకర్, ఉమాంగ్ యాప్, SMS సేవలు, IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం బోర్డు ఈసారి ‘ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్’ (IVRS) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా విద్యార్ధులు కేవలం ఒక ఫోన్ కాల్తో తమ సబ్జెక్టుల వారీగా మార్కులను తెలుసుకోవచ్చు. ఢిల్లీ విద్యార్థులు 24300699 నంబర్కు, దేశంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులు 011‑ 24300699 నంబర్కు కాల్ చేయాలి. కాల్ కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటెడ్ వాయిస్ సూచనల ప్రకారం అభ్యర్థి తన రోల్ నంబర్, స్కూల్ కోడ్ను నమోదు చేస్తే వెంటనే సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలను ఫోన్లోనే వినవచ్చు. కాగా ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి సమాధాన పత్రాలను ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతిలో డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఇప్పటికే ఏప్రిల్ 15న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇక 12వ తరగతి ఫలితాలు కూడా ప్రకటించేందుకు సీబీఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




