AP TET 2025 Notification: కొత్త టెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుందోచ్.. ఇంతకీ ఎప్పుడంటే?
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ త్వరలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలు పెట్టింది. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకంటే ముందు..

అమరావతి, అక్టోబర్ 17: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ త్వరలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలు పెట్టింది. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకంటే ముందు టెట్ పరీక్ష మరోమారు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే జారీ చేయనుంది. అయితే ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
అందుకే ఈసారి టెట్ పరీక్షకు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (ఎన్సీటీఈ) నిబంధనలను పాటించాలని విద్యాశాఖ భావిస్తుంది. టెట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతల్లో డిగ్రీ మార్కులు, వయసు, ఇతర అంశాలను పూర్తిగా ఎన్సీటీఈ నిబంధనలనే అమలు చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న టెట్ నిబంధనలు డీఎస్సీ నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలకు తెరదించుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు టెట్ పరీక్షలను ఎన్సీటీఈ తరహాలోకి మార్చాలని, తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక టెట్ నోటిఫికేషన్ నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి లోకేష్ పలు మార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పటికే మొత్తం 15,941 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా కొన్ని రిజర్వేషన్ కేటగిరిల్లో అభ్యర్థులు లేనందున పోస్టులు మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ మిగిలిపోయిన పోస్టులతో కొత్త పోస్టులు కలిపి మెుత్తం 2 వేల టీచర్ పోస్టులకు మరో డీఎస్సీ నోటిఫికేషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో జనవరిలో ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్లో సుమారు 2 వేల పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితోపాటు స్పెషల్ డీఎస్సీ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




