AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు

భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం మంది ధూమపానం చేయని వారేనని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యం, పాసివ్ స్మోకింగ్, జన్యుపరమైన మార్పులు వంటి కారణాలు ప్రధాన ముప్పుగా మారుతున్నాయి. నిరంతర దగ్గు, రక్తంతో దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు
Lung Cancer
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2026 | 11:46 AM

Share

భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. అందులోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) బారినపడే వారి సంఖ్య ఏటేటా ఆందోళనకరంగా పెరుగుతోంది. సాధారణంగా సిగరెట్లు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు తాగేవారికే ఈ క్యాన్సర్ వస్తుందని సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే, ఈ అపోహను పటాపంచలు చేస్తూ ఘాజియాబాద్‌లోని యశోద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మనీష్ సింఘాల్ సంచలన విషయాలను వెల్లడించారు. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం లంగ్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 50 శాతం మంది అసలు ధూమపానం చేయనివారే (Non-smokers) ఉంటున్నారని ఆయన వెల్లడించారు.

పశ్చిమ దేశాల కంటే భిన్నమైన పరిస్థితులు:

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల తీరు పూర్తిగా భిన్నంగా ఉంది. భారత్‌లో దాదాపు 10 కోట్ల మంది స్మోకర్లు ఉన్నప్పటికీ, ధూమపానానికి ఏమాత్రం అలవాటు లేని మహిళలు, యువత కూడా ఈ వ్యాధి బారిన పడటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని డాక్టర్ మనీష్ సింఘాల్ వివరించారు.

క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు: వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే తీవ్రమైన వాయు కాలుష్యం (Air Pollution), ఎదుటివారు వదిలిన పొగను పీల్చడం (Passive/Second-hand smoking), ఇళ్లలో ఉత్పత్తయ్యే రేడాన్ వాయువు ప్రభావం, రసాయనాల కాలుష్యం, జన్యుపరమైన మార్పులు (Genetic Mutations) దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

తక్కువ వయస్సులోనే ముప్పు: పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయులు సగటున ఒక దశాబ్దం ముందే (సుమారు 50 ఏళ్ల వయస్సులోనే) ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

ఆలస్యంగా నిర్ధారణే పెద్ద సవాలు:

భారతీయ పురుషులలో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. అయితే, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలను ప్రారంభంలో సాధారణ దగ్గు లేదా శ్వాసకోశ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల, దాదాపు 50 శాతానికి పైగా కేసులు చివరి దశలకు (Stage 3 or 4) చేరిన తర్వాతే వెలుగులోకి వస్తున్నాయి. దీనివల్ల బాధితులను కాపాడుకోవడం వైద్యులకు కత్తిమీద సాములా మారుతోందని డాక్టర్ మనీష్ సింఘాల్ తెలిపారు.

తప్పక గుర్తించాల్సిన ముఖ్య లక్షణాలు:

  • మందులు వాడినా తగ్గకుండా నిరంతరం వేధించే తీవ్రమైన దగ్గు
  • కారణం లేకుండా వేగంగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం
  • నడుస్తున్నప్పుడు లేదా శ్రమించినప్పుడు ఆయాసం, ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం
  • దగ్గినప్పుడు లేదా నోటి నుంచి రక్తం పడటం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆంకాలజిస్ట్‌ను సంప్రదించాలి. అధిక ముప్పు (High Risk) ఉన్నవారు ప్రతి ఏటా ‘లో-డోస్ సిటి స్కాన్’ (Low-dose CT scan) పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అధునాతన చికిత్సలు – పెరిగిన ఆశలు:

గతంలో లంగ్ క్యాన్సర్ అంటే కేవలం కీమోథెరపీ, రేడియేషన్ మాత్రమే దిక్కుగా ఉండేవి. కానీ, ఆధునిక వైద్యశాస్త్ర పురోగతి వల్ల ఇప్పుడు ‘ప్రిసిషన్ మెడిసిన్’ (Precision Medicine) అందుబాటులోకి వచ్చింది. ‘బయోమార్కర్ టెస్టింగ్’ ద్వారా రోగి శరీరంలోని జన్యు మార్పులను (EGFR, ALK, ROS1 వంటి ముటేషన్లను) ఖచ్చితంగా గుర్తించి, కేవలం ఆ క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడి చేసే ‘టార్గెటెడ్ థెరపీ’, శరీర రోగనిరోధక శక్తిని పెంచే ‘ఇమ్యునోథెరపీ’ చికిత్సలు అందిస్తున్నారు. వీటి ద్వారా రోగుల జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా, సాధారణ జీవితం గడిపేలా మంచి ఫలితాలను సాధించవచ్చని డాక్టర్ సింఘాల్ స్పష్టం చేశారు.

అయితే.. పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.. సొంతంగా మందులు తీసుకోవడం ప్రమాదకరం..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us