AP Inter Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదల చేసిన ఇంటర్ బోర్డు.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి..

అమరావతి, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదల చేసిన ఇంటర్ బోర్డు.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి అనుమతిస్తారు. సోమవారం నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మంగళవారం నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీటితోపాటు విద్యుత్, టాయిలెట్లు వంటి తదితర మౌలిక సదుపాయాలు విద్యార్ధుల సౌకర్యార్ధం కల్పించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు వివరించారు.
అలాగే పరీక్షలు మరింత పారదర్శంగా జరిగేందుకు పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాని, పటిష్ట నిఘాలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. మరోవైపు పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్ష కమిటీలు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తాయని తెలిపారు. ఇంటర పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. మార్చి 3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్మెటిక్స్, సివిక్స్ పేపర్లు మార్చి 4కి, మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లు మార్చి 21కి మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యార్ధులు, తల్లిదండ్రులు, కాలేజీలు గమనించాలని, తదనుగుణంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని ఇప్పటికే బోర్డు సూచించింది కూడా. మార్చి 3న హోలీ, మార్చి 20 రంజాన్ పండగ సెలవుల నేపథ్యంలో ఈ మార్పులు చేసింది. మిగిలిన పరీక్షలు యథాతథంగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.
పరీక్షలు రాసే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బస్సు సర్వీసులు నడపనుంది. ఈ మేరకు ఆర్టీసీని కోరినట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. చివరి నిమిషంలో గందరగోళానికి గురికాకుండా గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు వంటి ఎల్రక్టానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. పరీక్షలకు సంబంధించి ఇతర సందేహాలు, సమస్యలకు 1800–425–1531టోల్ ఫ్రీ నంబర్ ద్వారా విద్యార్ధులు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




