Inter Exams New Pattern 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల కేటాయింపులో కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే!
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు కొత్త సిలబస్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ భారీగా మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్టు పరీక్షల విధానంలో భారీగా మార్పులు..

అమరావతి, డిసెంబర్ 14: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు కొత్త సిలబస్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ భారీగా మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్టు పరీక్షల విధానంలో భారీగా మార్పులు చేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్లో ఈ ఏడాది మార్పులు చేశారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతి పేపర్కు 100 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఒక్క మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. ఇక పరీక్షలు రాసేందుకు జవాబుల బుక్లెట్ను కూడా 32 పేజీలకు పెంచారు.
సిలబస్ మారని సబ్జెక్టులకు మాత్రం 24 పేజీల బుక్లెట్నే కొనసాగిస్తున్నారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్ రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల్లో మాత్రమే ఈ మార్పులు చేశారు. సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రం ఈ ఏడాదికి పాత విధానంలోనే జరుగుతాయి. ప్రస్తుతం ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెలు, నాలుగు మెయిన్సబ్జెక్టులతో కలిపి మొత్తం 6 సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్ట్స్ గ్రూపుల్లో 2 లాంగ్వేజెస్, 3 మెయిన్ సబ్జెక్టులతో కలిపి మొత్తం 5 సబ్జెక్టులకు పరీక్షలు ఉన్నాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని గ్రూపులకు 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. ఇందులో ఒక లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ తప్పనిసరి.
రెండో లాంగ్వేజ్ని ఆరో సబ్జెక్టుగా ఎలక్టివ్గా మార్చారు. అంటే లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే 6వ సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి. సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో 3, 4, 5 సబ్జెక్టులు ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి.
మ్యాథ్స్లో ఏ, బి పేపర్లకు బదులు ఇప్పుడు ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘బయాలజీ’గా ఒక్క పేపర్గా ఇవ్వనున్నారు. అయితే జవాబులు రాసే బుక్లెట్స్ రెండింటికీ వేర్వేరుగా ఇస్తారు. వేర్వేరుగా జవాబులు రాయాలి. ఆర్ట్స్లో సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 26 కాంబినేషన్లు ఉంటాయి. ఇందులో విద్యార్ధులు తమకు నచ్చిన కాంబినేషన్ను ఎంచుకోవచ్చు. ఇలా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. అయితే ఇందులో సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉంటుంది. ఇక ప్రతి పేపర్లో 100 మార్కులకు 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత పొందినట్లు పరిగణిస్తారు. 85 మార్కుల పేపర్లకు 29 మార్కులు వస్తేనే పాసైనట్లు పరిగణిస్తారు. సైన్స్ ప్రాక్టికల్స్ రెండేళ్లలో 30 మార్కులకు గాను 11 మార్కులు తప్పనిసరిగా సాధించాలి. అంతేకాకుండా ఈసారి పరీక్షల్లో అర, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు రానున్నాయి. అర మార్కు, ఒక్క మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇక 202526 విద్యా సంవత్సరంలో సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థులకు పాత సిలబస్తోనే పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి మార్పులు ఉండవు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








