దారుణం.. పెళ్లైన 5 నెలలకే నవ వధువు సూసైడ్!
కూకట్పల్లిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ముసాపేట్ అంజయ్య నగర్ కి చెందిన యశ్వంత్ అనే వ్యక్తితో చందన జ్యోతికి 5 నెలల క్రితం వివాహం జరిగింది. గత రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అర్థరాత్రి చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

కూకట్పల్లి, డిసెంబర్ 13: వివాహం జరిగి ఆరునెలలు కూడా కాలేదు. అంతలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తరుచుగా గొడవలు పడసాగారు. చివరికి అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉరి వేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని కూకట్ పల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్లోని పొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి (25) కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో గత ఐదు నెలల క్రితం (ఆగస్టు) వివాహం జరిగింది. వీరు మూసాపేట్ అంజయ్య నగర్లో కాపురం ఉంటున్నారు. యశ్వంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి శుక్రవారం (డిసెంబర్ 12) రాత్రి అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన భర్త యశ్వంత్ 108 కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ కూతురు ఆత్మహత్యకు అల్లుడు యశ్వంత్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








