Inter Board: ఇక ఏప్రిల్ నుంచే కొత్త విద్యాసంవత్సరం షురూ.. ఇంటర్మీడియట్ విద్యలో సరికొత్త మార్పులు!
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డులో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు కొత్త సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యలో..

అమరావతి, మార్చి 13: ఇంటర్మీడియట్ బోర్డులో పలు కీలక సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ మేరకు మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించాగా.. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీలవైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారుచేసేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి క్యాలెండర్లో కీలక మార్పులు చేపట్టారు.
ఇంటర్మీడియట్ విద్యలోకి తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు ఇవే..
- ఇందులో భాగంగా జూన్ 1వతేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభంకానున్నాయి. అలాగే జూన్ 1కి బదులుగా ఏప్రిల్ 7 నుంచే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభంకానున్నాయి.
- 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. ట్యాబులేషన్ రిజిస్టర్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు.
- డిజిలాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుంచి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు.
- విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి, బహుళవిభాగ అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ విద్యాసంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు.
- లాంగ్వేజెస్, సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్ లో ఒక సబ్జెక్టును 2వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలల్లో ఎంబైపీసీ ప్రవేశపెట్టాలనే డిమాండ్కు అనుగుణంగా ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు (సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సహా) సవరించిన సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి. ఇంటర్మీడియట్లో ఇప్పటివరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఎ, బిలను ఇకపై ఒకే సబ్జెక్టుగా విలీనం చేయనున్నారు.
- అలాగే బైపీసీ విద్యార్థులకు బోటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్టు ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది.
- ఈఏపీసెట్, జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తుంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారు.
- కాంపిటీటివ్ బేస్డ్ ఎసెస్ మెంట్ కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాలప్రశ్నల్లో 10% తప్పనిసరిగా బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు), ఖాళీలను పూరించే రూపంలో ఒక మార్కు ప్రశ్నలు ఉండేలా కొశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు.
- NSQF స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యుయల్ సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలను అభివృద్ధి చేయడం, NSQF స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు.
- వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.