TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)లో 5 లక్షలు దాటిన ఉద్యోగులు.. దేశంలో అతిపెద్ద ఎంప్లాయర్స్‌

Tata Consultancy Services: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) సరికొత్త చరిత్ర సృష్టించింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు దాటింది..

TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)లో 5 లక్షలు దాటిన ఉద్యోగులు.. దేశంలో అతిపెద్ద ఎంప్లాయర్స్‌
Follow us

|

Updated on: Jul 09, 2021 | 11:46 AM

Tata Consultancy Services: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) సరికొత్త చరిత్ర సృష్టించింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి కంపెనీ సిబ్బంది 5,09,058కి చేరుకున్నారు. దేశంలో అతిపెద్ద టెక్నాలజీ ఎంప్లాయర్‌ అయిన టీసీఎస్‌.. ప్రపంచంలో యాక్సెంచర్‌ తర్వాత రెండో స్థానంలో ఉంది. అమెరికన్‌ ఐటీ కంపెనీ యాక్సెంచర్‌లో 5.37 లక్షల మంది పని చేస్తున్నారు. దేశంలోని ఇతర ఐటీ కంపెనీల విషయానికొస్తే, ఇన్ఫోసిస్‌లో దాదాపు 2.5 లక్షలు, విప్రోలో 1.9 లక్షలు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో 1.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలనూ పరిగణనలోకి తీసుకుంటే.. పది లక్షల మందికి పైగా ఉద్యోగం కల్పిస్తున్న రైల్వే శాఖ తర్వాత టీసీఎస్‌ రెండో అతిపెద్ద కంపెనీగా చెప్పవచ్చు. ఎల్‌అండ్‌ టీలో 3.37 లక్షలు, రిలయన్స్‌ ఇండస్ట్రీ స్‌లో దాదాపు 2 లక్షలు, ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు.

ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో20,409 ఉద్యోగులు

ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో కంపెనీ నికరంగా 20,409 మందిని ఉద్యోగలను చేర్చుకుంది. కంపెనీ త్రైమాసిక నికర నియామకాల్లో ఇప్పటివరకిదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని 155 దేశాలకు చెందిన వారు తమ వద్ద పనిచేస్తున్నారని, మొత్తం సిబ్బందిలో మహిళల వాటా 36.2 శాతంగా ఉందని టీసీఎస్‌ వెల్లడించింది. కాగా జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 8.6 శాతానికి తగ్గింది. దేశీయ ఐటీ రంగంలో కనిష్ఠ వలసల రేటు తమదేనని కంపెనీ అంటోంది.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో దెబ్బ..

కాగా, ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలపై దెబ్బ కొట్టింది. సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశీయ వ్యాపారం మందగించి మొత్తం కంపెనీ వృద్ధిని వెనక్కి లాగిందని టీసీఎస్ తెలిపింది. భారత వ్యాపారం 14 శాతం తగ్గి రూ.2085 కోట్లకు పరిమితమైంది. అమెరికా మార్కెట్లో ఆకర్షణీయ వృద్ధి సాధించగా, బ్యాంకింగ్, దేశీయ వ్యాపారాలు నిరాశపరిచాయి. కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల పాస్‌పోర్ట్స్ జారీ, టీసీఎస్ అయాన్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ వంటివి స్తంభించి, రూ.350 కోట్ల ఆదాయం తగ్గింది.

లాభం రూ.9,008 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) టీసీఎస్‌ ఏకీకృత నికర లాభం రూ.9,008 కోట్లకు చేరుకుంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.7,008 కోట్ల లాభంతో పోలిస్తే 28.5 శాతం అధికం. ఈ క్యూ1లో టీసీఎస్‌ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధి చెంది రూ.45,411 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఆదాయం రూ.38,322 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌-జూన్‌ కాలానికి కంపెనీ 810 కోట్ల డాలర్ల విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది.

ఇవీ కూడా చదవండి

Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!

Realme 5G Smartphones: భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తాం: రియల్‌మీ సీఈఓ మాధవ్‌