Stock Market: రాణించిన ఐటీ, ఆటోమొబైల్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ఐటీ(IT), ఆటోమొబైల్(Automobile) స్టాక్ల్లో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి...
ఐటీ(IT), ఆటోమొబైల్(Automobile) స్టాక్ల్లో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. ముడి చమురు ధర పెరిగినా ఐటీ, ఆటోమొబైల్ షేర్లు రాణించడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 697 పాయింట్లు పెరిగి 57,989 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ198 పాయింట్లు పెరిగి 17,316 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్, స్మాల్ క్యాప్ 0.28 శాతం చొప్పున పెరగాయి. నిఫ్టీ ఐటీ 1.96, నిఫ్టీ ఆటో 1.19 శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.73, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.71 శాతం తగ్గాయి. టెక్ మహీంద్రా నిఫ్టీ టాప్ గెయినర్గా నిలిచింది. 4.19 శాతం పెరిగి రూ. 1541.75 చేరింది.
బీపీసీఎల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కూడా లాభపడ్డాయి. 1,638 కంపెనీల షేర్లు లాభ పడగా.. 1,773 కంపెనీల షేర్లు నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్ఈ ఇండెక్స్లో టెక్ఎమ్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటిసి, టిసిఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్లలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా హెచ్యుఎల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో స్థిరపడ్డాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్ ధర 117 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ బ్యారెల్ ధర 113 డాలర్లకు చెరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా మంగళవారం పెట్రల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 91 పైసలు, లీటర్ డీజిల్పై 88 పైసలు పెరిగాయి.