Patanjali: 7 రోజుల్లో రూ.1500 కోట్ల లాభం.. పతంజలి షేర్ల జోరుతో ఇన్వెస్టర్ల పంట పండినట్లే..
స్టాక్ మార్కెట్లో పతంజలి ఫుడ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది.. త్రైమాసిక ఫలితాలు వెల్లడైనప్పటి నుండి ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కేవలం ఏడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1,500 కోట్లు పెరగడం గమనార్హం. లాభాల్లో 60 శాతం వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

యోగా గురు రామ్దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో సునామీ సృష్టిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత, ఈ కంపెనీ షేర్లు రాకెట్లా దూసుకుపోతున్నాయి. కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.1,500 కోట్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 11న త్రైమాసిక ఫలితాలు వెల్లడైనప్పటి నుండి పతంజలి షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. ఫిబ్రవరి 11న రూ.522 వద్ద ముగిసిన షేర్ ధర, ఫిబ్రవరి 20 నాటికి రూ.535.55కు చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే 2.59శాతం మేర వృద్ధిని నమోదు చేసింది.
కంపెనీ మార్కెట్ విలువ రూ.56,789 కోట్ల నుండి రూ.58,263 కోట్లకు పెరిగింది. అంటే పెట్టుబడిదారులకు రూ.1,474 కోట్ల నికర లాభం చేకూరింది. వంట నూనెల రంగంలో అగ్రగామిగా ఉన్న పతంజలి ఫుడ్స్.. ఈసారి ఊహించని రీతిలో లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.370.88 కోట్లుగా ఉన్న లాభం.. ఇప్పుడు ఏకంగా 60శాతం పెరిగి రూ.593.44 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం కూడా రూ.9,020 కోట్ల నుండి రూ.10,541.12 కోట్లకు పెరిగింది.
ఫలితాల వెనుక అసలు కారణాలు
పతంజలి ఫుడ్స్ కేవలం వంట నూనెలకే పరిమితం కాకుండా FMCG విభాగంలో దూసుకుపోవడం ఈ విజయానికి ప్రధాన కారణం. పండుగ సీజన్ డిమాండ్ కారణంగా బ్రాండెడ్ నూనెల విక్రయాలు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బిస్కెట్లు, నెయ్యి, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు ఏకంగా 39శాతం పెరగడం గమనార్హం. పామాయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతి ధరలు తగ్గడం కూడా కంపెనీ లాభాల మార్జిన్ పెరగడానికి దోహదపడింది.
