రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు.. కొత్త రూల్స్ ఇవే..
భారతీయ రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. టికెట్ రద్దు మరియు రీఫండ్ విధానంలో ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న 4 గంటల గడువును 8 గంటలకు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రూల్స్ తెలియకపోతే ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదు. ఆ కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపే పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా రైల్వే శాఖ ప్రయాణికుల టికెట్ రద్దు, రీఫండ్ విధానంలో కీలక సవరణలు చేసింది. ఈ మార్పుల పట్ల అవగాహన లేకపోతే ప్రయాణికులు తమ కష్టార్జితాన్ని ఒక్క క్షణంలో కోల్పోయే ప్రమాదం ఉంది. రైల్వే శాఖ ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు చేసుకునే సమయం ఇప్పుడు అత్యంత కీలకం. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు రద్దు చేసుకున్నా కొంత మొత్తంలో వాపసు వచ్చేది. కానీ ఏప్రిల్ 1 నుండి ఈ గడువును 8 గంటలకు పెంచారు. అంటే రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు మీరు టికెట్ రద్దు చేయాలని ప్రయత్నిస్తే, రైల్వే శాఖ నుండి మీకు ఒక్క రూపాయి కూడా రీఫండ్ లభించదు. మీరు ఒంటరిగా ప్రయాణించినా లేదా కుటుంబం మొత్తానికి టికెట్లు బుక్ చేసినా ఇదే నిబంధన వర్తిస్తుంది.
IRCTC రీఫండ్ శ్లాబ్లలో మార్పులు
కొత్త నిబంధనల ప్రకారం.. మీరు ఎంత ముందుగా టికెట్ రద్దు చేసుకుంటే అంత ఎక్కువ రీఫండ్ పొందే అవకాశం ఉంది.
72 గంటల కంటే ముందు: ప్రయాణానికి 3 రోజుల కంటే ముందే టికెట్ రద్దు చేసుకుంటే మీకు 100 శాతం పూర్తి నగదు వాపసు లభిస్తుంది.
24 నుండి 72 గంటల మధ్య: ఈ సమయంలో రద్దు చేసుకుంటే 75 శాతం నగదు మాత్రమే వెనక్కి వస్తుంది.
8 నుండి 24 గంటల మధ్య: రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు నుండి 8 గంటల సమయం లోపు రద్దు చేస్తే, కేవలం 50 శాతం రీఫండ్ మాత్రమే అందుతుంది.
8 గంటల లోపు: ఇక 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు రద్దు చేస్తే రీఫండ్ సున్నా.
ఆర్థిక జాగ్రత్తలు అవసరం
రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే, సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఏప్రిల్ 1 నుండి ప్రయాణాలు చేసే వారు బుకింగ్ సమయంలోనే ఈ కొత్త టైమ్ స్లాట్లను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నిబంధనల వల్ల రైల్వేలో అనవసరమైన టికెట్ హోల్డింగ్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నప్పటికీ, సామాన్య ప్రయాణికులకు మాత్రం ఇది ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన విషయమే.
