Car Exports: కార్ల ఎగుమతుల్లో భారత్ టాప్.. ఫోర్డ్ రీ ఎంట్రీకి కారణం అదేనా..?
భారతదేశంలో కార్ల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అయితే దేశీయ మార్కెట్ ఎంత ఉన్నా భారతదేశంలో తయారయ్యే కార్లు భారీ స్థాయిలో ఎగుమతి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కార్ల తయారీ సమయంలో నిర్వహణ ఖర్చు భారతదేశంలో తక్కువగా ఉండడంతో అన్ని కంపెనీలు భారతదేశంలో కార్ల తయారీ చేస్తున్నాయి. భారతదేశం నుంచి ఆటోమొబైల్ ఎగుమతుల పరిమాణాన్ని అనేక అంశాలు ప్రోత్సహించాయి. వీటిలో కొన్ని ఇతర దేశాల ప్రభుత్వాలతో వివిధ రకాల వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయడంలో భారతదేశంలోని ప్రభుత్వ పాత్రకు సంబంధించిన ప్రత్యక్ష పరిణామాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఫోర్డ్ కూడా ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని రీ ఎంట్రీకు సన్నాహాలు చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబరులో ఫోర్డ్ మోటార్ కంపెనీ తన చెన్నై ప్లాంట్ను తిరిగి తెరుస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఫోర్డ్ మోటర్స్ 2021లో భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అమెరికన్ ఆటోమేకర్ అయిన ఫోర్డ్ తన తదుపరి ప్లాన్ల వివరాలను వెల్లడించనప్పటికీ అంతర్గత దహన ఇంజిన్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లైట్ కమర్షియల్ వెహికల్, పిక్-అప్ విభాగాలలో కార్ల తయారీ చేపట్టనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర కార్ల తయారీ కంపెనీలతో జతకట్టి కార్లను తయారు చేసే అవకాశం ఉందని మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఫోర్డ్ రీ ఎంట్రీ ప్రకటనతో విదేశీ కార్ల తయారీదారులకు ఎగుమతి కేంద్రంగా భారతదేశం ఆవిర్భవించడంపై దృష్టి సారించింది.
1981లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన మారుతీ సుజుకీ అయినా లేదా 2017లో భారతదేశంలోకి ప్రవేశించిన కియా మోటార్స్ అయినా ఎగుమతులు వారి వ్యూహాలు, ఆదాయాలలో మరింత ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి. భారతీయ ఎగుమతులు సంప్రదాయబద్ధంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని మార్కెట్లకు పంపుతున్నాయి. ముఖ్యంగా కార్ల తయారీలో వచ్చిన మార్పులు అభివృద్ధి చెందిన మార్కెట్లకు భారతీయ ఉత్పత్తులు సరిపోవు అనే వారికి చెంప పెట్టు అని భారత ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2024లో భారతదేశం నుంచి ఎగుమతి చేసిన కార్ల సంఖ్య సుమారు 6.7 లక్షల యూనిట్లు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎగుమతుల మొత్తం అమ్మకాల శాతంగా 15 నుంచి 16 శాతానికి పెరిగాయి. అంతకుముందు 50 నుంచి 60 శాతం కంటే ఎక్కువ ఎగుమతులు హ్యాచ్బ్యాక్లను కలిగి ఉండేవి. అయితే అందులో 20 శాతం ఎస్యూవీలు ఉండగా, ప్రస్తుతం ఎస్యూవీలు దాదాపు 40 శాతం ఎగుమతులను కలిగి ఉన్నాయి.
ముఖ్యంగా భారత కంపెనీ అయిన మారుతీ సుజుకి భారతదేశంలో అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల ఎగుమతిదారుగా ఉంది. 1987-88 నుంచి ఈ కంపెనీ యూరప్కు వాహనాలను ఎగుమతి చేస్తోంది. అయితే మారుతీ సుజుకీ ఎగుమతి చేసే యూనిట్లు పరిమిత సంఖ్యలో ఉండడంతో ప్రపంచస్థాయిలో పోటీపడలేకపోయింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కార్యక్రమం దార్శనికతను బట్టి దేశీయ డిమాండ్తో మాత్రమే ఆశయం నెరవేరదని, గ్లోబల్ మార్కెట్లో భారతదేశం ఎక్కువ వాటాను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం మారుతీ సుజుకీ, హ్యూందాయ్, హోండా, వోక్స్వ్యాగన్, నిస్సాన్ కంపెనీ కార్లు అధిక సంఖ్యలో విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో భారతదేశంలో తయారు చేసిన వాహనాలు బీఎస్ ఉద్గార నిబంధనలను కలిగి ఉండటం, యూఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు యూరో -6 ఉద్గార నిబంధనలను కలిగి ఉండడం వల్ల ఎగుమతులు స్వల్ప స్థాయిల్లోనే ఉండేవి. అయితే ఎప్పుడైతే భారతదేశంలో బీఎస్-6 అమల్లోకి వచ్చిందో ఎగుమతులు ఊపందుకున్నాయి. అలాగే భారతదేశంలో తయారైన కార్లకు సేఫ్టీ రేటింగ్లను అందించడానికి గత సంవత్సరం ప్రభుత్వం భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన విషయం విధితమే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి