GST: గుడ్ న్యూస్.. జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు శ్లాబ్లు తొలగింపు.. తగ్గనున్న వాటి ధరలు..
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం నాలుగు శ్లాబ్లు ఉండగా..ఇకపై రెండు శ్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి. 12శాతం, 28శాతం శ్లాబ్లు తొలగింపుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇకపై కేవలం 5, 18శాతం శ్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి.

ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 9 గంటల వరకు అంటే ఏకంగా 10 గంటల పాటు కొనసాగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12, 28శాతం రెండు శ్లాబ్లను తొలగింపుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సామాన్యులు వాడే వస్తువులపై
సామాన్యులకు ఆర్థిక భారం పడకుండా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పేద ప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ బాగా తగ్గించామన్నారు. వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నెక్ట్స్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రానుంది.
రెండు ప్రధాన స్లాబ్లు ఆమోదం
ఈ సమావేశంలో 5శాతం, 18శాతం అనే రెండు ప్రధాన జీఎస్టీ శ్లాబ్లను ఆమోదించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 12శాతం, 28శాతం శ్లాబ్లను పూర్తిగా తొలగించారు. ఈ మార్పుల ద్వారా పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 12 శ్లాబ్లో ఉన్న దాదాపు 99శాతం వస్తువులను 5శాతం శ్లాబ్కు మార్చారు. 28శాతం శ్లాబ్లో ఉన్న చాలా వస్తువులను 18శాతం స్లాబ్కు మార్చారు. అంతేకాకుండా కొత్తగా 40శాతం స్లాబ్ తీసుకొచ్చారు. పాన్ మసాలా, పొగాకు వంటి హానికర వస్తువులు, లగ్జరీ కార్ల వంటి వాటిపై 40శాతం పన్ను అమలు చేయనున్నారు.
మొదటి రోజు కీలక నిర్ణయాలు
ఎగుమతిదారుల కోసం ఆటోమేటిక్ జీఎస్టీ వాపసు ప్రక్రియకు ఆమోదం తెలిపారు. ఎగుమతిదారుల రిజిస్ట్రేషన్ సమయాన్ని 1 నెల నుండి కేవలం 3 రోజులకు తగ్గించారు. రూ.2,500 వరకు విలువైన వస్త్రాలు, పాదరక్షలపై జీఎస్టీని 5శాతానికి తగ్గించారు. గతంలో వెయ్యి కంటే ఎక్కువ విలువ ఉన్న వస్తువులపై 12శాతం పన్ను ఉండేది. పనీర్, ఖాఖ్రా, చపాతీ, సబ్బు, టూత్పేస్ట్, షాంపూ వంటి రోజువారీ వస్తువులపై పన్నును 18శాతం నుండి 5శాతం లేదా 0శాతానికి తగ్గించడంపై చర్చ జరిగింది.
ప్రతిపక్షాల అభ్యంతరం
సమావేశంలో ప్రతిపక్ష రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పరిహారం అంశాన్ని లేవనెత్తారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు జరిగే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయకపోతే పన్ను రేట్లలో మార్పులకు సమ్మతి ఇవ్వబోమని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




