మీ జీతం ఎంత తక్కువైనా పర్లేదు.. ఈ రూల్ పాటిస్తే మీరే ధనవంతులు!
50-30-20 రూల్ అనేది వ్యక్తిగత ఖర్చులను నియంత్రించి పొదుపును పెంచుకోవడానికి ఒక ప్రభావవంతమైన బడ్జెటింగ్ విధానం. నికర ఆదాయంలో 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

వ్యక్తిగత ఖర్చులను నియంత్రించి పొదుపును పెంచుకోవాలనుకునే వారికి 50-30-20 రూల్ ఒక సులభమైన, సమర్థవంతమైన బడ్జెటింగ్ విధానంగా మారుతోంది. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఈ నియమాన్ని సరైన విధంగా అమలు చేస్తే నెలవారీ జీతాన్ని సమతుల్యంగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. ఈ విధానం ప్రకారం వ్యక్తి తన నికర ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించాలి. మొత్తం ఆదాయంలో 50 శాతం అవసరమైన ఖర్చులకు కేటాయించాలి. వీటిలో ఇల్లు అద్దె, కిరాణా సరుకులు, విద్యుత్ బిల్లులు, రవాణా వంటి తప్పనిసరి ఖర్చులు వస్తాయి. ఖర్చులు ఈ పరిమితిని దాటకుండా చూసుకోవడం ఈ నియమంలోని మొదటి మెట్టు.
తదుపరి 30 శాతం వ్యక్తిగత కోరికలు లేదా జీవనశైలి ఖర్చులకు కేటాయించాలి. ఇందులో బయట భోజనం, సినిమాలు, షాపింగ్, ట్రావెల్ వంటి అవసరం కాని కానీ మనసుకు ఆనందం ఇచ్చే ఖర్చులు ఉంటాయి. నిపుణులు చెబుతున్నదేమిటంటే ఈ భాగాన్ని నియంత్రణలో ఉంచితే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మిగిలిన 20 శాతం తప్పనిసరిగా పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర పెట్టుబడులు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ 20 శాతం భాగాన్ని ముందుగా విడిగా ఉంచడం మంచి అలవాటుగా భావిస్తున్నారు.
అయితే ఆదాయం తక్కువగా ఉన్నవారు లేదా పెద్ద నగరాల్లో అధిక అద్దె చెల్లించే వారు ఈ శాతాలను కొంతవరకు మార్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఖర్చు, పొదుపు మధ్య సమతుల్యతను నేర్పే ప్రాథమిక ఫ్రేమ్వర్క్గా 50-30-20 రూల్ ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. సరైన క్రమశిక్షణతో అమలు చేస్తే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
