Investment Schemes: పెట్టుబడిదారులకు అలెర్ట్.. ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు సరిచూసుకోవాల్సిందే..!
ధనం మూలం ఇదం జగత్ అంటే ప్రస్తుత సమాజంలో డబ్బు ఉన్న వారికే గౌరవం దక్కుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇతరుపై ఆధారపడకుండా పొదుపు మార్గాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి దేశంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. అయితే తాజాగా ఆర్బీఐ నిర్ణయంతో వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు వడ్డీ రేట్లను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు లేదా 1 శాతం తగ్గించిన తర్వాత వివిధ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. అయితే భారత ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాలపై ఉన్న వడ్డీ రేట్లను కొనసాగించింది. జూన్ 30 నాటికి ఈ ప్రభుత్వ-ప్రాయోజిత పథకాలలో పెట్టుబడులకు అందించే వడ్డీ రేట్లు మారలేదు. అయితే ఈ పథకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కొత్త రేట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం నుంచి మాత్రమే వర్తిస్తాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే చిన్న మొత్తాల పొదుపు పథకాలు అధిక రాబడినిస్తున్నాయి.
ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వంటి వాటిపై వడ్డీ రేట్లను అంచనా వేయడంతో పాటు, అదే ఐదేళ్ల కాలపరిమితి కలిగిన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం పెట్టుబడిదారులకు 7.7 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తుండగా, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఐదు సంవత్సరాల కాలానికి 7.5 శాతం వడ్డీ రేటుతో వస్తుంది. ప్రభుత్వ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం సీనియర్ సిటిజన్లకు అదే కాలానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. వీటితో పోల్చితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ సాధారణ పెట్టుబడిదారులకు 6.3 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ప్రధాన బ్యాంకుల విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.4 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.6 శాతం సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. బహుళ పన్ను ప్రయోజనాలతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలను అందించే ప్రభుత్వ పథకాలకు ఇవన్నీ సరిపోతాయి. ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా సంప్రదాయవాద పెట్టుబడిదారులు, పొదుపుదారులకు ఆకర్షణీయంగా ఉంటాయి. వారు తమ అసలు మొత్తాన్ని నష్టాల నుంచి కాపాడుకుంటూ ఊహించదగిన రాబడిని పొందాలని కోరుకుంటారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణించవచ్చు. కానీ అవి పరిమిత కవరేజీని అందిస్తాయని గుర్తుపెట్టుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..