Gold: బంగారం మార్కెట్లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు.. అసలు కారణాలు ఇవే
అల్మారాలో ఉండాల్సిన బంగారం.. ఇప్పుడు మార్కెట్లో పేకమేడలా కూలిపోతోంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 1975 నాటి రికార్డులను సైతం బద్దలు కొడుతూ బంగారం ధరలు పాతాళానికి పడిపోయాయి. కేవలం 25 రోజుల్లోనే 20 శాతం పతనం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు పసిడి మార్కెట్లో ఈ మహా ప్రళయం ఎందుకు వచ్చింది?

పసిడి ప్రేమికులకు ఇది ఊహించని షాక్.. అదే సమయంలో కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం. మార్చి 2026 నెల బంగారం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా, మరికొందరికి సువర్ణావకాశంగా నిలిచిపోనుంది. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు కుప్పకూలాయి. 1975 తర్వాత అతిపెద్ద చారిత్రక పతనాన్ని పసిడి మార్కెట్ చవిచూస్తోంది. గత 25 రోజుల్లోనే బంగారం ధరలు ఏకంగా 20 శాతం మేర పడిపోయాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పతనం, మార్చి నెలలో సునామీలా మారి మార్కెట్ను ముంచెత్తింది. జనవరి చివరి నాటి ధరలతో పోలిస్తే కేవలం ఒక్క రోజులోనే 10 శాతం వరకు ధరలు పడిపోవడం పెద్ద పెట్టుబడిదారుల నిద్రను దూరం చేసింది. 1978, 1980, 1983 మరియు 2008 ఆర్థిక మాంద్యాల సమయంలో కూడా ఇంత వేగంగా ధరలు తగ్గలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
1975 నాటి చేదు జ్ఞాపకాలు..
ప్రస్తుత పరిస్థితి 1975 నాటి సంక్షోభాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో అమెరికాలో బంగారంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసినప్పుడు ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యి, వారంలోనే ధరలు 197 డాలర్ల నుండి 167 డాలర్లకు పడిపోయాయి. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి అనిశ్చిత వాతావరణమే ఇప్పుడు కనిపిస్తోంది.
భారత మార్కెట్పై గోల్డ్ ఎఫెక్ట్
భారతదేశంలో బంగారం అంటే కేవలం లోహం కాదు, అదొక సెంటిమెంట్. 1975లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.20-30 తగ్గితేనే అప్పట్లో అదొక సంచలనం. ఎందుకంటే అప్పుడు సగటు జీతం రూ.300-500 మాత్రమే ఉండేది. కానీ నేడు 20 శాతం పతనం అంటే.. తులం బంగారంపై వేల రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ ముందు ఈ ధరల తగ్గింపు సామాన్యులకు వరంగా మారగా, భారీ రేట్లకు కొన్న ఆభరణాల వ్యాపారులకు, ఇన్వెస్టర్లకు మాత్రం శాపంగా మారింది.
ఇది కొనడానికి సమయమేనా?
అధిక ధరల్లో ఉన్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు, బిస్కెట్లు కొన్నవారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అయితే, కొత్తగా బంగారం కొనాలనుకునే వారికి గత 50 ఏళ్లలో ఇదే అతిపెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఐతే మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉందని, ఇప్పుడే తొందరపడి మొత్తం పెట్టుబడి పెట్టకుండా వేచి చూసే ధోరణి అవలంబించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
