Kyc Process: ఆగస్ట్ నుంచి కొత్త రూల్స్.. కేవైసీ ప్రక్రియలో మార్పులు.. ప్రతీసారి ఇక అక్కర్లేదు..
బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి వరకు ప్రతీ పనికి కేవైసీ ప్రక్రియ అనేది అవసరం. అయితే ప్రతీసారి కేవైసీ ప్రక్రియ కోసం చాలా సమయం పడుతుంది. ఇందుకు ఆధార్, పాన్ లాంటి డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది.

బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదా ఇన్యూరెన్స్, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్నా ముందుగా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఆధార్, పాన్ లాంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి ప్రతీసారి కేవైసీ కోసం మీరు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ కేవైసీ పూర్తవుతుంది. ఇందుకోసం సెంట్రల్ నో యువర్ కస్టమర్(CKYC) వ్యవస్థను ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇప్పుడు CKYC 2.0ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తొలి విడత ఆగస్టు నుండి బ్యాంకులుచ బీమా కంపెనీలతో ప్రారంభమవుతుంది. అనంతరం మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ సంస్థలు ఈ ఏడాది కల్లా ఈ వ్యవస్థలో చేరనున్నాయి.
కేవైసీ పత్రాలు అవసరం లేదు..
ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రతిసారీ కేవైసీ పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఖాతాదారులు తమ అనుమతిని తెలియచేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు మీ వివరాలను కేంద్ర రిజిస్ట్రీ నుండి పొందుతాయి. దీనివల్ల మీరు ఏవైనా ఆర్థిక సేవలు పొందాలనుకున్నప్పుడు పదే పదే కేవైసీ చేయాల్సిన పని ఉండదు. దీని వల్ల మరింత వేగంగా, సౌకర్యవంతంగా సేవలు పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ వ్యవస్థను అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మ్యూచువల్ ఫండ్లు, బ్రోకరేజ్ కంపెనీలు ఈ ప్లాట్ఫామ్కు అనుసంధానం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కేవైసీ కోసం ప్రతీసారి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు.
120 కోట్ల రికార్డులు
దేశంలో ఇప్పటికే సుమారు 120 కోట్ల రికార్డులతో ఒక కేంద్ర కేవైసీ రిజిస్ట్రీ ఉంది. అయితే నకిలీ నమోదులు, అసంపూర్ణ సమాచారం, డేటా నాణ్యతకు సంబంధించిన ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సీకేవైసీ 2.0 ఈ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి వినియోగదారు రికార్డుకు ఒక కాన్ఫిడెన్స్ స్కోర్ ఉంటుంది. ఇది ఆ సమాచారం ఎంత నమ్మదగినదో, దానిని ఏదైనా ఆర్థిక సంస్థ ధృవీకరించిందో లేదో తెలియజేస్తుంది. వినియోగదారు డేటాను యాక్సెస్ చేయాలనుకునే ఏ సంస్థకైనా ఓటీపీ ఆధారిత అనుమతి ప్రక్రియ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ చేయబడిన ఈ వ్యవస్థ కస్టమర్ సౌకర్యాన్ని, భద్రతను రెండింటినీ మెరుగుపర్చనుంది. ఒకే ధృవీకరించబడిన రికార్డు నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపులు, ఆర్థిక మోసాల ప్రమాదాన్ని ఇది తగ్గించనుంది..
