Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. కొత్తగా రెండు రైల్వే లైన్లు.. అప్పటికల్లా పూర్తి..
ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. రెండు కొత్త రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. బళ్లారి-గుంతకల్ రూట్లలో అదనంగా మరో రెండు లైన్లను నిర్మించనుంది. దీనికి బడ్జెట్ కూడా కేటాయించారు. 2029లోగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య బళ్లారి-గుంతకల్ మార్గంలో అదనంగా మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మూడు, నాలుగవ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.1,264 కోట్లుగా అంచనా వేశారు. ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్ 2028-29 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టనుండగా.. బహుళ రవాణా మార్గాల అనుసంధానాన్ని, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు జిల్లాలను కవర్ చేస్తుంది.
సరుకు రవాణాకు కీలకం
ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా భారత రైల్వే ప్రస్తుత నెట్వర్క్ను సుమారు 46 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ విస్తరణ వల్ల సుమారు 7 లక్షల జనాభా, 99 గ్రామాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే అదనంగా బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు రైలు మార్గం మరింత సులభతరం అవుతుంది. ఇక బళ్లారి-గుంతకల్ రైల్వే లైన్ ఒక కీలకమైన సరుకు రవాణా మార్గంగా మారనుంది. ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, ఇనుము, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణాకు ప్రధాన కేంద్రంగా పనిచేయనుందని రైల్వేశాఖ చెబుతుంది. ట్రాక్ సామర్థ్యం మరింత పెరిగితే అదనంగా 16.22 మిలియన్ టన్నున సరుకును రవాణా చేయవచ్చని పేర్కొంది. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా అనేక పర్యావరణ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనివల్ల దేశానికి సుమారు 13.2 మిలియన్ లీటర్ల ముడి చమురు దిగుమతులు ఆదా అవుతాయి. అలాగే 66.7 మిలియన్ కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది సుమారు 2.7 మిలియన్ చెట్లను నాటడంతో సమానమని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
తగ్గనున్న రవాణా ఖర్చు
ఈ ప్రాజెక్టులో భాగంగా 52 చిత్త వంతెనలు, 7 పెద్ద వంతెనలు, ఒక మెగా బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. అలాే వేదవతి నదిపై భారీ వంతెన రానుంది. మొత్తం ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.1264 కోట్లు కేటాయించింది. 46 కిలోమీటర్ల మార్గాన్ని మూడేళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 22 కిలోమీటర్లు, కర్ణాటకలో 24 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రెండు రైల్వే లైన్లతో ప్రతీ ఏటా సరుకు రవాణా ఖర్చు రూ.149 కోట్ల మేర తగ్గనుంది.
