AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. మోదీని కల్సింది అందుకే!

చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశప్రధానిని కల్వడంలో పెద్దగా విశేషమేమీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమో.. పెండింగ్ అంశాల క్లియరెన్స్‌ కోసమో సీఎం ప్రధాన మంత్రిని కల్వడం సర్వ సాధారణం. అయితే.. తాజాగా జగన్, మోదీల భేటీ.. కేంద్రంలో మారుతున్న సమీకరణలకు సంకేతమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీతో కలిసీ, కల్వనట్లు సంబంధాలు నెరపుతున్న వైసీపీని కేంద్ర కేబినెట్‌లో […]

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. మోదీని కల్సింది అందుకే!
Rajesh Sharma
|

Updated on: Feb 12, 2020 | 7:01 PM

Share

చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశప్రధానిని కల్వడంలో పెద్దగా విశేషమేమీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమో.. పెండింగ్ అంశాల క్లియరెన్స్‌ కోసమో సీఎం ప్రధాన మంత్రిని కల్వడం సర్వ సాధారణం. అయితే.. తాజాగా జగన్, మోదీల భేటీ.. కేంద్రంలో మారుతున్న సమీకరణలకు సంకేతమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీతో కలిసీ, కల్వనట్లు సంబంధాలు నెరపుతున్న వైసీపీని కేంద్ర కేబినెట్‌లో చేరాలని బీజేపీ తరచూ కోరుతున్న నేపథ్యంలోనే జగన్ సడన్‌గా ఢిల్లీకి పయనమయ్యారంటూ రాజకీయాలలో పెద్ద చర్చ మొదలైంది.

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో గంటకుపైగా సమావేశమయ్యారు. అంతే ఇక్కడ ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆ వార్త చక్కర్లు కొట్టడం కామన్‌గా మారింది. ఇంతకీ ఆ వార్తలో ఉన్న నిజమెంత? కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందా? ఇదిప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందని ఢిల్లీ వీధుల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. కేంద్రంలో చేరే విషయంపై ప్రధానితో జగన్‌ చర్చించారని గుసగుసలు మొదలయ్యాయి. కేంద్రంలో వైసీపీ చేరితే రెండు కేబినెట్‌ బెర్త్‌లు దక్కుతాయని తెలుస్తోంది. రాజ్యసభ కోటాలో విజయసాయిరెడ్డి, లోక్‌సభ కోటాలో నందిగం సురేష్‌ కేంద్ర మంత్రులు అవుతారని టాక్‌ మొదలైంది. కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయేలో వైసీపీ చేరుతుందని ఏడాదిగా ప్రచారం నడుస్తోంది. ఇటు బీజేపీ నేతలు కూడా వైసీపీ కేబినెట్‌లో చేరితే తమకు అభ్యంతరం లేదని ఆఫ్‌ ది రికార్డులో మాట్లాడుతున్నారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరాలని సంకేతాలు పంపుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందన్న ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా ఈవార్తలను తోసిపుచ్చుతున్నారు. కేంద్రంలో తాము చేరే చాన్స్‌ లేదని… ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచో పుట్టుకోస్తాయో తెలియదని అంటున్నారు. ఇటు వైసీపీ కీలక నేతలు కేంద్రంలో చేరే విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ, సీఎం జగన్ భేటీపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. దాదాపు గంటన్నరపాటు సాగిన సమావేశంలో ఎక్కువగా రాజకీయాంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పరస్పర ప్రయోజనాల రీత్యా పరస్పరం సహకారించుకోవాలన్న అంశంపైనే వీరిద్దరు ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. రాజ్యసభలో ప్రాంతీయ పార్టీల సహకారం కోరుతున్న బీజేపీ.. వైసీపీ నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తోంది. వీరిద్దరి భేటీలో వైసీపీ సహకారాన్ని సాక్షాత్తు మోదీ ఆశించారని అంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి భేటీలో అసలేం జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us