ఏపీలో ఏకంగా 32 వేల మందికి కరోనా పరీక్షలు.. జగన్ సంచలన ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 32 వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించాలని అధికారులను పురమాయించారు. అయితే ఆ 32 వేల మంది ఎవరు అన్న చర్చ ఇపుడు ఏపీవ్యాప్తంగా మొదలైంది.

ఏపీలో ఏకంగా 32 వేల మందికి కరోనా పరీక్షలు.. జగన్ సంచలన ఆదేశం
Follow us

|

Updated on: Apr 15, 2020 | 8:07 PM

ఏపీలో గుర్తించిన 32 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్-19 నియంత్రణా చర్యలను, తాజా పరిస్థితిని ఆయన బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2100 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో రోజుకు 4 వేల పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ట్రూనాట్‌ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని అధికారులు తెలిపారు.

అయితే, కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించడంతో అధికారయంత్రాంగం ఖంగుతిన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మరింత గట్టిగా చెప్పడంతో వారందరికీ గురువారం నుంచి పరీక్షలు ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఈ 32వేల పరీక్షలు పూర్తి అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పౌరులందరికీ ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్‌ కోసం, దుప్పటి కోసం 500 రూపాయలు, పారిశుద్యం ప్రతీ రోజు ప్రతీ మనిషికి 50 రూపాయలు, ఇతర ఖర్చులకోసం మరో 50 రూపాయలు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు 300 రూపాయలు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో 300 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా అధికారులు సీఎంకు వివరించారు.

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తి చేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు బీదలకు కనీసం 2 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సీఎం సూచించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించాలని, ఆ తర్వాత ప్రతీ వారం వారికి పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలని, ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.

Read this: బాబోయ్.. 477 జిల్లాలకు కరోనా ప్రమాదం.. కేంద్రం వార్నింగ్