AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR: తొలిసారి సీఎం అయిన వెంటనే వైఎస్సార్ ఏ ఫైలుపై సంతకం చేశారో తెలుసా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న తొలి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అమలు చేస్తూ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

YSR: తొలిసారి సీఎం అయిన వెంటనే వైఎస్సార్ ఏ ఫైలుపై సంతకం చేశారో తెలుసా..?
YS Rajasekhara Reddy
Ram Naramaneni
|

Updated on: Jul 19, 2026 | 5:35 PM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రైతు బాంధవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజా సమస్యలపై ప్రత్యక్ష అవగాహన కోసం చేపట్టిన 1,475 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందిన ఆయన, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించారు. అనంతరం 2004 మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన అత్యంత కీలక హామీని అమలు చేస్తూ రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. అలానే రైతాంగానికి సంబంధించిన కరెంట్ బకాయలు రూ.1100 కోట్లు కూడా రద్దు చేశారు. దీంతో రైతు సంక్షేమమే తన ప్రభుత్వ తొలి ప్రాధాన్యమనే స్పష్టమైన సందేశాన్ని వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు.

ఆ సమయంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బోర్లు, పంపుసెట్లు నడపడానికి విద్యుత్ బిల్లుల భారం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటలు దెబ్బతినడం, అప్పుల భారం పెరగడం, ఆర్థిక ఇబ్బందులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని వైఎస్సార్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆ హామీని అమలు చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఉచిత విద్యుత్ నిర్ణయంతో పాటు రైతులపై పేరుకుపోయిన విద్యుత్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడంలో, సాగు విస్తీర్ణాన్ని పెంచడంలో ఈ నిర్ణయం కీలకంగా మారిందని అప్పటి వ్యవసాయ వర్గాలు పేర్కొన్నాయి.

వైఎస్సార్ పాలనలో రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఉచిత విద్యుత్‌తో పాటు జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ఊపునిచ్చారు. రైతులకు సాగునీరు అందించేందుకు భారీ ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారు. వ్యవసాయ రంగానికి మౌలిక వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

రైతు సంక్షేమంతో పాటు పేదల సంక్షేమానికీ వైఎస్సార్ ప్రభుత్వం పలు కీలక పథకాలను ప్రవేశపెట్టింది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, 108 అత్యవసర అంబులెన్స్ సేవలు ప్రారంభించడం, 104 గ్రామీణ ఆరోగ్య సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళల కోసం పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది.

ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేయడం వైఎస్సార్ రాజకీయ జీవితంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ తొలి నిర్ణయం నేటికీ ఒక ప్రతీకగా నిలుస్తోంది.

Follow Us