AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: తీవ్ర తుపానుగా ‘జొవాద్‌​’.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. హైఅలెర్ట్..

గండం ముంచుకొస్తోంది. సైక్లోన్ సైరన్‌ మోగిస్తోంది. తుఫాన్‌ తరుముతోంది.. జొవాద్‌ దూసుకొస్తోంది.  తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP Weather: తీవ్ర తుపానుగా 'జొవాద్‌​'.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. హైఅలెర్ట్..
Jawad Cyclone
Ram Naramaneni
|

Updated on: Dec 04, 2021 | 10:57 AM

Share

గండం ముంచుకొస్తోంది. సైక్లోన్ సైరన్‌ మోగిస్తోంది. తుఫాన్‌ తరుముతోంది.. జొవాద్‌ దూసుకొస్తోంది.  తీవ్ర తుపానుగా మారిన ‘జవాద్’.. ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 490 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇటు విశాఖకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 89 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. జిల్లా, డివిజన్ స్థాయిలో 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. మరోవైపు.. జొవాద్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది విశాఖ నేవీ. సహాయక చర్యల కోసం 13 ఫ్లడ్‌ రిలీఫ్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. ఒడిశాకు 3 ఫ్లడ్‌ రిలీఫ్‌టీమ్స్, డైవింగ్‌ టీమ్స్‌ పంపిస్తున్నారు. సహాయక చర్యల కోసం NDRF, SDRF బృందాలు రెడీ అయ్యాయి. మొత్తం 1,735 సహాయక బృందాల్ని ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లు సహా నాలుగు ఓడలు సిద్ధం చేసింది నేవీ. అతి భారీ వర్షాల నేపథ్యంలో.. ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు 9 బృందాలు ఏర్పాటు చేశారు. ఈనెల 5 వరకు విశాఖలో పర్యాటక ప్రదేశాలు మూసివేయనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరం అల్లకల్లోలం మారింది. ఉప్పాడ-కాకినాడ వైపు వెళ్లే బీచ్ రోడ్డులో.. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలల ధాటికి రక్షణగా వేసిన జియోట్యూబ్ తెగిపడింది. రోడ్డుపై పడిన రాళ్లతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

శ్రీకాకుళం జిల్లాపై సైతం జొవాద్ తుఫాన్‌ ఎఫెక్ట్ చూపుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కళింగపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే NDRF బృందాలు శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాయి. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 38 కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు నెలకొల్పారు.

మరోవైపు.. తుఫాన్‌పై సమీక్షించారు సీఎం వైఎస్‌ జగన్‌. తుఫాన్‌ కారణంగా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. సహాయచర్యల కోసం ప్రభావిత జిల్లాలకు 10 కోట్ల చొప్పున అందుబాటులో ఉంచామని చెప్పారు. తుపాను పరిస్థితిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు సీఎం. ముంపుప్రాంతాల ప్రజల్ని ముందే అప్రమత్తం చేసి తరలించాలని.. చెరువులు, కాల్వల పరిస్థితిని పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు.

తుఫాన్‌ ఎఫెక్ట్‌ రైతు బజార్లపైనా కనిపిస్తోంది. రైతుబజార్లలో విపరీతమైన రద్దీ పెరిగింది. కూరగాయల కోసం జనం ఎగబడుతున్నారు. టమాటా, ఉల్లిపాయల కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జనం కూరగాయలు సమకూర్చుకుంటున్నారు.

Also Read: ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?

Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం

Follow Us