AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కీలక నేత ఇంటి చుట్టూ రాజకీయ నాయకులు సందడి.. వరుస భేటీలు అందుకేనా..?

ఆ పెద్దాయన ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కూడా అంతంత మాత్రంగానే పాల్గొన్నారు. ఎన్నికలు ముగిశాక తన ఇంట్లో తాఫీగా ఉన్నారు. కానీ ఆయన్ని కలిసేందుకు మాత్రం ముఖ్యనాయకులు తాకిడి ఎక్కువ అయ్యింది. రోజుకో ముఖ్యనేత ఆయన్ను కలుస్తుండటంతో హడావుడి నెలకొంది. రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్న ఆయన్ని ఆ ముఖ్యనేతలు ఎందుకు కలుస్తున్నారు? వారి కలయిక వెనుక ఉన్న రాజకీయ రహాస్యం ఏంటి? వారి చర్చలు దేనికి సంకేతం? ఇదే ఆ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారింది.

ఆ కీలక నేత ఇంటి చుట్టూ రాజకీయ నాయకులు సందడి.. వరుస భేటీలు అందుకేనా..?
TDP
Gamidi Koteswara Rao
| Edited By: Srikar T|

Updated on: Jun 02, 2024 | 2:59 PM

Share

ఆ పెద్దాయన ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేశారు. గతం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కూడా అంతంత మాత్రంగానే పాల్గొన్నారు. ఎన్నికలు ముగిశాక తన ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆయన్ని కలిసేందుకు మాత్రం ముఖ్యనాయకుల తాకిడి ఎక్కువ అయ్యింది. రోజుకో ముఖ్యనేత ఆయన్ను కలుస్తుండటంతో హడావిడి నెలకొంది. రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్న ఆయన్ని ఆ ముఖ్యనేతలు ఎందుకు కలుస్తున్నారు? వారి కలయిక వెనుక ఉన్న రాజకీయ రహాస్యం ఏంటి? వారి చర్చలు దేనికి సంకేతం? ఇదే ఆ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారింది. అశోక్ గజపతి రాజు పార్టీలో నెంబర్ టూ.. పార్టీ అధినేతకు సమకాలీకుడు. పార్టీ పట్ల అత్యంత విధేయుడు. ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజకీయాలకు పరిచయం అక్కర్లేని నేత అశోక్ గజపతిరాజు. రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన అశోక్ గజపతిరాజు మొత్తం పది సార్లు ఎన్నికల బరిలో దిగగా 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు మినహా వరుసగా అన్ని ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారు.

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడిగు పెట్టారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో సమకాలిక రాజకీయాలు చేసిన నేత. 2014లో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక విప్లవ సంస్కరణలతో తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూశారు. అయితే ఆ ఎన్నికల సమయంలోనే అనారోగ్యంతో ఇబ్బంది పడిన అశోక్ గజపతిరాజు ఎన్నికల తరువాత మేజర్ సర్జరీ చేయించుకున్నారు. అప్పటినుంచి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతునప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొనేవారు. అయితే సుమారు డెబ్భై ఐదు సంవత్సరాలు పైబడిన అశోక్ గజపతిరాజు అనారోగ్య సమస్యలతో పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతి రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తే ఆమె తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. ఆ తరువాత ఆయన తన నివాసానికి పరిమితమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల ఆయన్ను పలువురు కీలకనేతలు వచ్చి కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అందులో భాగంగా నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అశోక్ గజపతి రాజు నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు పర్సనల్‎గా భేటీ అయ్యారు.

ఆ భేటీలో భాగంగా వారి మధ్య కీలక రాజకీయ పరమైన చర్చ జరిగినట్లు సమాచారం. క్షత్రియ సామాజిక వర్గంకు టీడిపిలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఏ విధమైన పదవులు దక్కే అవకాశం ఉంది? ప్రభుత్వంలో తమ సామాజికవర్గం నుండి ఎవరికి ప్రాధాన్యం దక్కితే సామాజికవర్గానికి ప్రయోజనం ఉంటుంది అనే అనేక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉత్తరాంధ్రకు చెందిన కీలకనేత కొణతాల రామకృష్ణ కూడా అశోక్ గజపతి రాజును కలిశారు. ఆయన కూడా కొంత సేపు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. అయితే జనసేన నేత అయిన కొణతాల అనకాపల్లి నుండి పోటీచేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అశోక్ గజపతిరాజు మద్దతు కోరినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ క్రమంలో మరికొంత మంది కీలకనేతలు కూడా కౌంటింగ్‎లోపు అశోక్ గజపతి రాజును కలవనున్నట్లు సమాచారం. అశోక్ గజపతి ఎన్నికలకు దూరంగా ఉన్నా పార్టీలో మాత్రం ఆయన నిర్ణయాలు కీలకం కావడంతో ముఖ్యనేతలు ఆయన మద్దతు కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా అశోక్ గజపతి రాజు మద్దతు కోరేందుకు వస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. ఏదిఏమైనా ముఖ్యనేతల భేటీ సారాంశం ఆ దేవునికే ఎరుక అని అంటున్నారు పార్టీలోని మరికొందరు నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..