ఏపీలో 1,500 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్.. ఎక్కడంటే
కరోనాపై పోరులో భాగంగా మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.8.50కోట్లతో రాష్ట్రంలో 1,500 పడకలతో భారీ కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తోంది.
కరోనాపై పోరులో భాగంగా మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.8.50కోట్లతో రాష్ట్రంలో 1,500 పడకలతో భారీ కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తోంది. రాప్తాడు సమీపంలోని రామినేపల్లి వద్ద ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాము (వేర్హౌస్)లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొత్తం 12 బ్లాక్లకు గాను రెండు బ్లాక్లు మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. కరోనా బాధితులకు సేవలు అందించేందుకు వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది అక్కడే ఉండేందుకు అన్ని వసతులతో(పురుషులు, మహిళలకు వేర్వేరుగా) కూడిన షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే అక్కడ రెండు క్లినికల్ ల్యాబోరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలు చేయనున్నారు. కోవిడ్ కేర్ సెంటర్కు రోగి చేరుకోగానే అక్కడి సైన్బోర్డులో వివరాలు నమోదు చేస్తారు. వెంటనే ల్యాబ్కు పంపించి పరీక్షలు చేసి.. తర్వాత రోగికి పడక కేటాయిస్తారు. వారి సామగ్రి ఉంచుకునేందుకు ఓ ట్రంక్ పెట్టెను ఇవ్వనున్నారు. ప్రతి పడకకూ ఓ నంబర్ కేటాయించనున్నారు. పేషంట్ల సౌకర్యం కోసం వాల్ మౌంట్ ఫ్యాన్లు, ఫెడస్టల్ ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు.. వారు నడిచేందుకు వీలుగా ర్యాంప్లు నిర్మిస్తున్నారు.
ఇక రోగులకు భోజనం కోసం ప్రత్యేకంగా వంట గదిని ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్లో విద్యుత్, నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండు బోర్లను వేయించి.. నాలుగు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు.