AP Night Curfew: కరోనా కల్లోలానికి స్తంభించిన జనజీవనం.. విశాఖ జిల్లాలో కొనసాగిన రాత్రిపూట కర్ఫ్యూ.. డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ మళ్లి కర్ఫ్యూతో బందీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విశాఖ జిల్లాలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.
AP Govt To Impose Night Curfew: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ మళ్లి కర్ఫ్యూతో బందీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విశాఖ జిల్లాలో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. పోలీసుల సూచనలతో విశాఖ నగరంలోని ప్రధాన వర్తక సముదాయాలు, షాపింగ్ మాల్స్ కర్ఫ్యూ ప్రారంభానికి గంట ముందుగానే మూతపడ్డాయి. రాత్రి 9 గంటలకే నగరంలోని చాలా చోట్ల జనసంచారం తగ్గి, రోడ్లు నిర్మానుష్యంగా మారి పోయాయి. నగరంలోని పలుచోట్ల డ్రోన్ కెమెరా ద్వారా జనసంచారంపై నిఘా పెట్టారు పోలీసులు.
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు తో విశాఖ జిల్లాలో స్వచ్ఛంద పాక్షిక లాక్ డౌన్ లను ఎక్కడికక్కడ స్థానిక వర్తకులు కొనసాగిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుండి రాత్రి పూట కర్ఫ్యూ నీ అమలులోకి తెచ్చింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ కర్ఫ్యూ ప్రభావం ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ లో మొదటిరోజు స్పష్టంగానే కనిపించింది. నగరంలోని జగదాంబ సెంటర్, సిరిపురం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, గాజువాక ,మధురవాడ వంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రారంభానికి గంట ముందు నుంచే ప్రధాన వర్తక సముదాయాలు ,షాపింగ్ మాల్స్ ను నిర్వాహకులు మూసివేశారు.
అటు, రాత్రి 9గంటల సమయానికే నగరంలోని చాలా ప్రాంతాల్లో జన సంచారం తగ్గి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కర్ఫ్యూ ప్రారంభానికి కొన్ని గంటల ముందే పోలీసులు రోడ్లపైకి వచ్చి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని ప్రజలు తమ కార్యకలాపాలు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. విశాఖ నగరంలో అమలు కోసం 23 పోలీస్ సబ్ కంట్రోల్ పాయింట్స్ తో పాటు నైట్ పెట్రోలింగ్ టీములను ఏర్పాటు చేశారు. నగరంలోని బీచ్ రోడ్ తోపాటు, పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ల ద్వారా జనసంచారంపై నిఘా పెట్టారు పోలీసులు.
కర్ఫ్యూ కారణంగా సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న నైట్ ఫుడ్ కోర్టు సైతం 10 గంటలకే మూతపడింది. దీంతో ఆహార ప్రియులు డిన్నర్ కోసం అవస్థలు పడ్డారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ విధించిన కర్ఫ్యూ తర్వాత ఎక్కడ పూర్తిస్థాయి లాక్ డౌన్ కు దారితీస్తుందో అన్న భయంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వలస కూలీలు నెల్లూరు నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. అలా వచ్చిన వలస కూలీలు అంతా కర్ఫ్యూ కారణంగా విశాఖలో ఇరుక్కుపోయారు. విశాఖ వరకు చేరుకున్న వీరు శ్రీకాకుళం వెళ్లేందుకు వేరే మార్గం లేక రాత్రంతా విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే జాగారం చేశారు.
నగరంలోనే కాదు విశాఖ జిల్లాలోని అటు రూరల్ ,ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రాత్రి అంతా కర్ఫ్యూ అమలైంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరుకు తోపాటు ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి ప్రాంతాలలో సైతం అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని అడ్డుకున్నారు పోలీసులు. అత్యవసరాల నిమిత్తం తిరిగే వాహనాలకు వెసులుబాటు ఇచ్చిన పోలీసులు, అనవసరంగా బయట తిరిగేవారికి మొదటి రోజు కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సరిపెట్టారు. ఇకపై మాత్రం రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.