US shooting: నేరుగా వచ్చి కౌంటర్లో ఉన్న తెలుగు వ్యక్తిపై కాల్పులు.. వీడియో
అమెరికాలోని అర్కాన్సాస్లోని కిరాణా దుకాణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. కాల్పుల్లో బిల్లింగ్ కౌంటర్ వద్ద ఉన్న ఏపీ వ్యక్తి గోపీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. అతను మరుసటి రోజు ఆసుపత్రిలో మరణించాడు. ఈ వార్త తెలియగానే బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిలో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్కాన్సాస్లోని ఒక కిరాణా దుకాణంలో శుక్రవారం ఒక షూటర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మృతుల్లో తెలుగు యువకుడు కూడా ఉన్నాడు. ఇద్దరు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సహా మరో 9 మంది గాయపడ్డారు. మృతుడిని ఆంధ్రాలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడి అర్కాన్సాస్లోని ఫోర్డైస్ అనే చిన్న పట్టణంలోని మ్యాడ్ బుట్చేర్ కిరాణా దుకాణంలో పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఆదివారం చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
CCTV footage of the incident of Gopi Krishna attacked by the robber pic.twitter.com/WeWMxObR8b
— Sudhakar Udumula (@sudhakarudumula) June 23, 2024
అనుమానిత షూటర్ను న్యూ ఎడిన్బర్గ్కు చెందిన 44 ఏళ్ల ట్రావిస్ యూజీన్ పోసీగా పోలీసులు గుర్తించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను కూడా గాయపడ్డాడు. అతని గాయాలు ప్రాణాంతకం కావని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
