Visakha Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ విజిటర్స్ బుక్లో ఆసక్తికర వ్యాఖ్యలు రాసిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి..!
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో... కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనపై కార్మికుల్లో ఆశలు చిగురించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మూత పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. విజిటర్స్ బుక్లో స్పష్టంగా ఆ విషయం నమోదు చేశారు.
రెండు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్పై హడావుడి జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నేతలు ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఢిల్లీ లో కలిసి స్టీల్ ప్లాంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఆర్ఎన్ఐఎల్ను బయటకు తెచ్చి నష్టాల ఊబి నుంచి బయటపడడానికి ప్రత్యామ్నాయాలు వెతకాలని సూచించారు. వెంటనే స్పందించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖకు రావడంతో ఏదో సానుకూల నిర్ణయం జరుగుతున్నట్లుగా అందరూ భావించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో… కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనపై కార్మికుల్లో ఆశలు చిగురించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మూత పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. విజిటర్స్ బుక్లో స్పష్టంగా ఆ విషయం నమోదు చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. తాను ప్రధానికి నోట్ సమర్పిస్తానని.. ప్రధాని ఆశీస్సులతో మళ్ళీ ప్లాంట్ పునరుద్ధరణ జరుగుతుందని అన్నారు.
అయితే కుమార స్వామి రాకపై ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కొంత హింట్ ఇవ్వడంతో అనిశ్చితి తొలగింది. కానీ ఏకంగా కేంద్ర ఉక్కు మంత్రినే ప్లాంట్లో ఉండడంతో ఏం జరుగుతుందో అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. శ్రీనివాస్ వర్మ చెప్పిన దాని ప్రకారం కేంద్ర ఉక్కు మంత్రి పర్యటనలో అద్భుతాలు ఏమీ జరగవని, పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్లాంట్ స్థితిగతులను నేరుగా తెలుసుకునేందుకే వస్తున్నామని చెప్పుకొచ్చారు శ్రీనివాస వర్మ. దీంతో నిన్నటికే ఆ అనిశ్చితి తొలగింది
రెండు రోజుల విశాఖ టూర్లో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. ప్లాంట్లోని కోక్ ఓవెన్; ఈడీ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎస్ఎంఎస్2, వైర్ రాడ్ మిల్ విభాగాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తిని అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకు పైగా ప్లాంట్లోనే తిరిగారు. మంత్రి కుమారస్వామి. ఆ తర్వాత అడ్మిన్ బిల్డింగ్కు వెళ్లి విశాఖ ఉక్కు సీఎండీ అతుల్ భట్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. ప్లాంట్ నమూనాను పూర్తిగా పరిశీలించారు. దాదాపు నాలుగు గంటలకు పైగా స్టీల్ ప్లాంట్ సందర్శనలోనే గడిపారు మంత్రి కుమారస్వామి.
ఆ తర్వాత కార్మిక సంఘాల నాయకులతో మంత్రి కుమారస్వామి సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు మంత్రిని కోరారు. అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా.. సెయిల్లో విలీనం చేయాలని కోరారు. అందరి వినతులు విన్నాక మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశాభివృద్ధికి సాయపడుతున్నదన్న సంగతి అర్థమైందన్నారు. స్టీల్ ప్లాంట్ అధ్యయనం కోసమే తాను వచ్చానన్నారు. ఇక్కడి పరిస్థితిని ప్రధానికి వివరిస్తానని వెల్లడించారు. స్థానికుల సెంటిమెంట్, కార్మికుల జీవనోపాధి తనకు బాగా అర్థమైనదని మంత్రి చెప్పారు. ఈ ప్లాంట్ను పరిరక్షించడమే బాధ్యతగా ముందుకు వెళతామన్నారు. ప్రధాని ఆశీస్సులతో స్టీల్ప్లాంట్ను వంద శాతం పునరుద్ధరించే అవకాశమున్నదని చెప్పారు. అన్నింటికంటే అతి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరిస్తారని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటనతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సానుకూల పరిస్థితి ఏర్పడిందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఎంపీలు కలిసిన 14 రోజుల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖకు వచ్చారని, అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పిన మంత్రిని ఆర్థిక భారం లేకుండా చూడాలని కోరినట్టు పల్లా తెలిపారు. బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను ఆర్ఐఎన్ఎల్ పేరుపై మార్చాలని, లేదంటే స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలనీ, అదీ కుదరకపోతే సెయిల్లో విలీనం చేయాలని కోరామన్నారు పల్లా శ్రీనివాసరావు. స్టీల్ప్లాంట్పై మేనిఫెస్టోలో చెప్పినట్టే జరుగుతుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…