మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్ పోసి యువకుడి హత్య!
పాతికేళ్ల కుర్రాడిని కొందరు ఆకతాయిలు శ్మాశాన వాటికలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికంగా ఓ బావి నుంచి దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద చోటు చేసుకుంది..

హిందూపురం, ఫిబ్రవరి 8: మద్యం మత్తులో పాతికేళ్ల కుర్రాడిని కొందరు ఆకతాయిలు శ్మాశాన వాటికలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికంగా ఓ బావి నుంచి దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హిందూపురం పట్టణంకి చెందిన సుహేబ్ (25) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. నింకంపల్లి సమీపంలోని ఓ పాడుబడిన బావి నుంచి శనివారం దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి చూడగా బావిలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహం కనిపించింది. టూటౌన్ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడిని హిందూపురం పట్టణం సమీపంలోని హస్నాబాద్కు చెందిన సుహేబ్గా గుర్తించారు.
అనంతరం సుహేబ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రెండు, మూడు రోజుల కిందట కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడి సుహేబ్ను గొంతుకోసి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం వారు మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానితులైన యువకులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




