Andhra: హైదరాబాద్ హైటెక్ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో.. అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా... క్వాంటం వ్యాలీ టవర్స్కి పునాదిరాయి పడింది. అతిరథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం.. ఆద్యంతం గొప్పగా సాగింది. రాష్ట్ర భవితకు బలమైన భరోసానిచ్చింది. ఆ వివరాలు ఇలా..

ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి మంత్రి లోకేష్ సహా… ఐటీ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ.. భారతదేశ భవిష్యత్తుగా అభివర్ణించారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. ఇది డిజిటల్ సెక్యూరిటీని మరింతగా పెంచుతుందన్నారు. వైద్యరంగంలోనూ క్వాంటం కంప్యూటింగ్ ఉపయోగాలు అనేకం ఉన్నాయన్న కేంద్రమంత్రి… దేశం ఇవాళ పవిత్రమైన అమరావతి నుంచి క్వాంటం జర్నీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
అమరావతి, ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్కు కూడా ఇదొక చారిత్రాత్మక రోజన్నారు చంద్రబాబు. ఇవాళ క్వాంటం వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయలేదన్న సీఎం.. గ్లోబల్ క్వాంటం రెవల్యూషన్లో భాగమయ్యే నిపుణుల ఉత్పాదక కేంద్రానికి కూడా పునాది వేసుకుంటున్నామని చెప్పారు. ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలోనే… క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని చెప్పారు. అమరావతిని ప్రపంచంలో టాప్ త్రీ క్వాంటం వ్యాలీల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి నారాలోకేష్. హైదరాబాద్ ఇండియా ఐటి రివల్యూషన్కు కారణం అయితే… ఏపిలోని అమరావతి… క్వాంటం రెవెల్యూషన్కు కేంద్రంగా మారుతుందని చెప్పారు. అట్టహాసంగా జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం… 15 భాగస్వామ్య సంస్థలతో ఎంవోయూలు కుదరడం విశేషం. అత్యధికంగా క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధికి 6 సంస్థలతో అవగాహనా ఒప్పందం జరిగింది.
