ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇదేం దారుణం..? నగల కోసం 65 ఏళ్ల మహిళ గొంతుకోసి హత్య
టెంపుల్ సిటీలో నేర సంస్కృతి ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆధ్యాత్మిక నగరంలో జరుగుతున్న హత్యల సంస్కృతి ఆందోళన కలిగిస్తుంది. వరుస హత్యలతో నేరాల క్రూరత్వం పెరుగుతోంది. ఆధ్యాత్మిక నగరంలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితికి కారణం అవుతోంది. ఇందులో భాగం గానే వారం రోజుల క్రితం ఒక పెళ్లి మండపం వద్ద జంట హత్యల ఘటన జరిగింది. ఇప్పుడు నగల కోసం 65 ఏళ్ల మహిళ హతకు గురైంది. అలజడి సృష్టించిన దుండగులు నిన్న రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు..

తిరుపతి, జులై 15: బైరాగి పట్టెడ ప్రాంతంలోని జయనగర్ లో 65 ఏళ్ల జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన దుండగులు ఇంట్లోకి చొరబడి హత మార్చారు. దోపిడీకి వచ్చిన దుండగులు జ్యోతి ఇంటిపై దాడి చేసి భయపెట్టి నగలు చోరీ చేయకుండా ఆమె గొంతు కోసి హతమార్చి మెడలోని బంగారు గొలుసు చెవిపోగులు ఎత్తుకెళ్లారు. జ్యోతి వేలిని కూడా అందరికీ తీసుకెళ్లిన దుండగులు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయిన భర్త నిన్న కొడుకును యుఎస్ కు పంపేందుకు బెంగళూరుకు వెళ్ళగా జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉంది.
ఇదే సమయంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరు నుంచి భార్యకు ఫోన్ చేసిన భర్త తో మాట్లాడిన జ్యోతి ఆ తర్వాత రెస్పాండ్ కాలేదు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఫోన్ చేస్తే భార్య స్పందించకపోవడంతో పని మనిషికి, ఇంటి పై అద్దెకున్న వారికి ఫోన్ చేసి భర్త ఆరా తీశారు. దీంతో అలర్ట్ అయి చూస్తే తాళం వేసిన ఇంటిలో జ్యోతి(65) రక్తపు మడుగులో పడి ఉన్నట్లు తెలిసింది.
నగలు చోరీ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన దుండగులు జ్యోతిని హత్య చేసినట్లు గుర్తించి భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గొంతుకోసి మెడలోని బంగారం తో దుండగులు పరారైనట్లు గుర్తించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డ పోలీసులు ఘటన స్థలం పరిసరాల్లోని సిసి కెమెరా పుట్టేజీని పరిశీలిస్తున్నారు.
