AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strait of Hormuz: హర్మోజ్ జలసంధికి మన తెలుగు నేలకు సంబంధం ఉంది తెలుసా?

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తున్న అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మోజ్ జలసంధి. ఒకప్పుడు ఇదే ప్రాంతం మన తెలుగు నేల చరిత్రను, రాజుల గెలుపు ఓటములను శాసించింది. ఈ సముద్ర మార్గాన్ని మన పూర్వీకులు, కవులు ముద్దుగా హురుమంజి లేదా హొరమంజి అని పిలిచేవారు.

Strait of Hormuz: హర్మోజ్ జలసంధికి మన తెలుగు నేలకు సంబంధం ఉంది తెలుసా?
Strait Of Hormuz Link Andhra
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 7:14 PM

Share

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తున్న అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మోజ్ జలసంధి. ఒకప్పుడు ఇదే ప్రాంతం మన తెలుగు నేల చరిత్రను, రాజుల గెలుపు ఓటములను శాసించింది. ఈ సముద్ర మార్గాన్ని మన పూర్వీకులు, కవులు ముద్దుగా హురుమంజి లేదా హొరమంజి అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతం నుంచే మన తెలుగు నేలకు భారీ స్థాయిలో విదేశీ వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. మన పురాతన కావ్యాలు సైతం ఈ వ్యాపార గొప్పదనాన్ని అద్భుతంగా వర్ణించాయి.

మధ్యయుగంలో కాకతీయ రాజులకు, విజయనగర చక్రవర్తులకు యుద్ధాల్లో గెలవాలంటే అత్యుత్తమ జాతి అశ్వాలు ఎంతో అవసరం. ఆ సమయంలో అరేబియా, పర్షియా దేశాల నుంచి అత్యంత వేగంగా పరుగెత్తే మేలు జాతి గుర్రాలు ఇక్కడి నుంచే వచ్చేవి. ఈ హురుమంజి రేవు నుంచే ఓడల ద్వారా ఆ అశ్వాలు ఆంధ్రాలోని మన కోస్తా తీరాలకు చేరుకునేవి. మోటుపల్లి, మచిలీపట్నం రేవులకు వచ్చే ఈ గుర్రాల గురించి శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. హురుమంజి నుంచి వచ్చే గుర్రాలు, ఏనుగులు శత్రువుల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మన సొంత రేవులను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నాడే గుర్తించారు.

తెలుగు కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన హరవిలాసం కావ్యంలోనూ ఈ ప్రాంతం గురించి అద్భుతమైన పద్యాలు రాశారు. అవచి తిప్పయ్య శెట్టి అనే గొప్ప వ్యాపారి వ్యాపార నైపుణ్యాన్ని అందులో వివరించారు. ఆయన హురుమంజి నుంచి అత్యంత వేగంగా పరుగెత్తే అందమైన గుర్రాలను తీసుకువచ్చేవాడని ఆ కావ్యంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. కేవలం యుద్ధ అశ్వాలు మాత్రమే కాకుండా ఎన్నో అత్యంత విలువైన వస్తువులు ఈ హురుమంజి నుంచి మన సీమకు దిగుమతి అయ్యేవి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి అత్యంత నాణ్యమైన ఆణిముత్యాలు మన రాణుల అలంకరణ కోసం ఇక్కడికి చేరుకునేవి. ఆ ముత్యాల సౌందర్యాన్ని మన కవులు కావ్యాల్లో గొప్పగా పొగిడారు. వీటితో పాటు పర్షియా నుంచి సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకమైన గులాబీ పన్నీరు మన రాజుల దర్బారులకు వచ్చేవి. అలాగే ఎండిన పండ్లు, బాదం, పిస్తా వంటి ఖరీదైన ఆహార పదార్థాలు కూడా ఇక్కడి నుంచే రవాణా అయ్యేవి. నాణ్యమైన ముఖమల్ పట్టు వస్త్రాలు ఈ రేవు మీదుగానే మన నేలకు దిగుమతి అయ్యేవని చరిత్ర చెబుతోంది.

ప్రస్తుత హర్మోజ్ జలసంధి కేవలం ఒక చమురు రవాణా కేంద్రం మాత్రమే కాదు. ఒకప్పుడు మన తెలుగు రాజ్యాల సైనిక బలానికి, అంతులేని సిరిసంపదలకు అది ఒక రాచమార్గం. ఆనాటి మన వర్తకులు సముద్రాలపై ఆధిపత్యం చెలాయించి దేశానికి అపారమైన సంపదను తీసుకువచ్చారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ప్రపంచాన్ని వణికిస్తున్న సముద్ర మార్గంగా హర్మోజ్ జలసంధి మార్గం ఆగితే చమురు ఆగుతుంది. చమురు ఆగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ హర్మోజ్.. ఒకప్పుడు మన తెలుగు రాజ్యాల యుద్ధ శక్తి, వాణిజ్య సంపదకు నేరుగా అనుసంధానమైందంటే ఆశ్చర్యమే. నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఈ జలసంధి, అప్పట్లో మన చరిత్రను ప్రభావితం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us