TDP: టీడీపీకి తలబొప్పి కట్టిస్తున్న ఆ ఎంపీ సీటు.. పిలిచి టికెట్ ఇస్తామన్నా ముందుకురాని నేతలు.. ప్రతి ఎన్నికలో కొత్త అభ్యర్థి కోసం వేట..
ఏపీలో టీడీపీ ఎంత బలంగా ఉన్నా ఆ ఎంపీ సీటు మాత్రం కొరకరాని కొయ్యగా మారిందట. అక్కడ్నించి పోటీ చేయడానికి పిలిచి టికెట్ ఇస్తామన్నా ఎవ్వరూ ముందుకు రావట్లేదట. ఇది ఒక్కసారి వ్యవహారం కాదట..
ఒంగోలు పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదట. 1952లో ద్విసభ్య పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న ఒంగోలు 1957 ఎన్నికల్లో ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు, ఇండిపెండెంట్లు రెండుసార్లు, సీపీఐ ఒకసారి, టీడీపీ రెండుసార్లు, రెండుసార్లు వైసిపి అభ్యర్థులు గెలుపొందారు.
జగ్గయ్య గెలుపు..
ఒంగోలు పార్లమెంట్ స్థానంలో అప్పట్లో కాంగ్రెస్ హవా అంతా ఇంతా కాదట. ఒంగోలు నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని సినీనటుడు కొంగర జగ్గయ్య 1967లో ఒంగోలు నుంచి పార్లమెంట్కు కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందడమే ఇందుకు నిదర్శనంగా చెబుతారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తేచాలు ఆయన ఎంపి అయిపోయినట్టేనట… అలా ఉండేదిట అప్పట్లో కాంగ్రెస్ హవా..
రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి కంచుకోట
మరోవైపు టిడిపి ఆవిర్బావం తరువాత పదిసార్లు ఎన్నికలు జరిగితే టిడిపి కేవలం రెండే రెండుసార్లు మాత్రమే గెలుపొందింది. 1984లో ఆ తర్వాత 1999లో టీడీపీ ఇక్కడ్నించి గెలిచింది. 1999 తరువాత టిడిపి అభ్యర్ధులు ఒంగోలు నుంచి పార్లమెంట్కు వెళ్ళిందే లేదు. రాష్ట్ర విభజనకు పూర్వం కాంగ్రెస్ , విభజన తరువాత వైసిపికి ఒంగోలు పార్లమెంట్ సీటు కంచుకోటగా మారిందని చెబుతారు. 2014లో వైవి సుబ్బారెడ్డి, 2019లో మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపి అభ్యర్థులుగా వరుసగా గెలిచారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణంగా భావిస్తారట.
20 ఏళ్ల నుంచి గెలవని టీడీపీ
ఒంగోలు పార్లమెంట్ స్థానం మొదటి నుంచి టిడిపికి కొరకరాని కొయ్యగానే ఉందట. టిడిపి ఆవిర్భావం తరువాత 1984లో, పదిహేనేళ్ళ తరువాత 1999లో మాత్రమే ఆ పార్టీ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత 20 ఏళ్ళుగా టిడిపి ఇక్కడ గెలిచిందే లేదు. ఈ ఇరవై ఏళ్ళ కాలంలో టిడిపి నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్ధి మరోసారి పోటీచేసేందుకు ముందుకు రావడం లేదట.దీంతో టిడిపికి ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట తప్పనిసరిగా మారిందట.
పూర్తి స్థాయి నాయకుడు లేరు
టీడీపీ తరఫున 2004 , 2009, 2014, 2019లో కొత్త వ్యక్తులే పోటీ చేస్తూ వచ్చి ఓడిపోయారు. ఇప్పటికీ టీడీపీకి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నాయకుడంటూ ఎవరూ లేరట. నామ్కేవాస్తే ఇన్చార్జిలుగా కొంతమందిని నియమించినా పూర్తిస్థాయి నాయకుడిగా ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఎందుకంటే ఓడిపోయే స్థానంలో ఎవరు పోటీ చేస్తారు చెప్పండి అంటున్నారట సీనియర్ టిడిపి నేతలు. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఎవరైనా ముందుకు వస్తారు కానీ, కుంటిగుర్రం ఎక్కేందుకు ఎవరు వస్తారు అంటున్నారట.
ఒంగోలులో ఓడిన వెంకయ్య నాయుడు
ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి.. దీంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ముందుకు వస్తారట… అందుకు అనుగుణంగానే కాంగ్రెస్, టిడిపి, వైసిపిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఎక్కువసార్లు టికెట్లు ఇచ్చారట… అందుకే ఇక్కడ 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 12 మంది అభ్యర్ధులు గెలిచారని విశ్లేషకులు లెక్కలు చెబుతున్నారు. 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భారతీయ లోక్దళ్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారట.
పాతుకుపోయిన మాగుంట కుటుంబం
ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి వలస వచ్చిన మాగుంట కుటుంబం ఇక్కడ పాతుకుపోయిందట. 1991 ఆ తర్వాత 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి మాగుంట కుటుంబ సభ్యులు పోటీ చేసి గెలుపొందారు. దీంతో టిడిపికి ఒంగోలు పార్లమెంట్ స్థానం అందని ద్రాక్షలాగా మారిపోయిందట. ఇరవై ఏళ్ళ తరువాతైనా టిడిపి జెండా ఎగురవేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం