9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!
Kancharla Srinu Murder Case: మార్కాపురం జిల్లా పొదిలిలో 2017లో జరిగిన కంచర్ల శ్రీను హత్య కేసులో నేరం రుజువైందని తేల్చిన కోర్టు 13 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ సంచలన కేసులో తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది.

మార్కాపురం జిల్లా పొదిలిలో కంచర్ల శ్రీను అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులపై నేరం రుజువైనందున 13 మందికి జీవిత ఖైదు విధుస్తూ మార్కాపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కంచర్ల శ్రీను హత్య కేసులో న్యాయస్థానంలో సుదీర్ఘవాదనల అనంతరం తీర్పు వెలువడింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్య కేసులో 13 మంది నిందితులకు మార్కాపురం కోర్టు జీవిత ఖైదు విధించించడం సంచలనంగా మారింది.
మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీను వ్యవసాయం చేసుకుంటూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలుస్తూ ప్రజా సమస్యలపై చురుకుగా పనిచేస్తుండేవారు. అయితే గ్రామ రాజకీయ విభేదాల కారణంగా కొందరితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో 2017 మే 17వ తేదీన బ్యాంకు పని నిమిత్తం బైక్పై పొదిలికి వెళ్లిన శ్రీను ఇంటికి తిరిగి రాలేదు. ఆ తరువాత బాప్టిస్ట్పాలెం సమీపంలోని రహదారి పక్కన ఆయన మృతదేహం రక్తపు మడుగులో గుర్తించారు. ప్రత్యర్థులు గొడ్డళ్లతో అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేసినట్లు అప్పటి దర్యాప్తులో తేలింది.
మృతుడి భార్య కాశీ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, ఇనుప రాడ్లు, కర్రలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు విచారణ ఒంగోలు సెషన్స్ కోర్టు నుంచి మార్కాపురంలోని ఆరవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. విచారణలో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, దర్యాప్తు వివరాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైందని నిర్ధారించింది. దీంతో జూన్ 10, 2026న తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. 13 మంది నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
Cr.No:65/2017 u/s 120(B), 143,147,148,302 r/w 149 IPC కేసులోని శిక్ష పడిన నిందితుల్లో చల్లా వెంకటేశ్వర్లు, చల్లా వెంకట నరసింహం, సన్నెబోయిన కృష్ణయ్య, చల్లా శ్రీను, లోమడ హరిబాబు, చల్లా అనిల్, చలివేంద్ర ప్రసాద్, చల్లా రమేష్, చల్లానా నాగయ్య, దోసపాటి వెంకటయ్య, దోసపాటి శ్రీనివాసులు, జూపల్లి శివయ్య, చల్లా రవి ఉన్నారు.
