ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్పై బెట్టింగ్! రాజానగరంలో బెట్టింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని చక్రద్వారాభందం గ్రామంలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసి 20 మందిని అరెస్టు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు సంబంధించి లక్షల రూపాయల బెట్టింగ్ జరిగిందని పోలీసులు తెలిపారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో బెట్టింగ్ మాఫియా మరింత ముదిరిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారాభందం గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న రాత్రి క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు పక్కా సమాచారం తో దాడి చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి, ఛాంపియన్గా నిలిచింది. ఒక వైపు అంతా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తుంటే మరోవైపు ఓ బెట్టింగ్ ముఠా ఈ మ్యాచ్ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉండడంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చి పోయారు. ఏకంగా లక్షల్లో బెట్టింగ్ నడిపించారు.
రాజానగరం పోలీ స్ స్టేషన్ పరిధిలోని బ్రిడ్జ్ కౌంట్ లో ఉన్న ఓ విల్లాలో భారీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. పోలీసులు దాడి చేసి 20 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కర్ణాటక రాయ్చూర్ ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. భారీస్థాయిలో ఆన్లైన్ లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, బెట్టింగులను నడుపుతున్న వ్యక్తుల వెనుక ఎవరు ఉన్నారు? ఎంత నగదు సీజ్ చేశారానేది మీడియాకి వివరాలు వెల్లడిస్తామని రాజానగరం పోలీసులు తెలిపారు. అయితే మరో రెండు వారాల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ మాఫియా మరింత చెలరేగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.