JEE Main 2026 Toppers: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఇద్దరికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ 1 పేపర్ 2 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 24) సాయంత్రం విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో జనవరి 29వ తేదీన పేపర్ 2ఏ, 2బీ ప్రవేశ పరీక్షలు..

హైదరాబాద్, ఫిబ్రవరి 25: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 జనవరి సెషన్ 1 పేపర్ 2 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 24) సాయంత్రం విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో జనవరి 29వ తేదీన పేపర్ 2ఏ, 2బీ ప్రవేశ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పేపర్ 1 ఫలితాలు విడుదల చేసిన ఎన్టీయే.. తాజాగా పేపర్ 2 ఫలితాలు కూడా వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 23న విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో కేరళకు చెందిన ఇద్దరు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్లో పేపర్ 2Aలో వోరుగంటి శరణ్య అశ్విని, పేపర్ 2Bలో పైలా హర్షాదిత్య 99.99 పర్సంటైల్ సాధించారు. తెలంగాణలో తెల్లూరి శ్రేయస్ రెడ్డి పేపర్ 2ఏ (బీఆర్క్)లో, మద్దూరి నాగ ప్రద్యుమ్న రెడ్డి పేపర్ 2బీ (బీ ప్లానింగ్)లో 99.99 పర్సంటైల్ సాంధించి టాపర్లుగా నిలిచారు.
టాపర్స్ వివరాలు..
- సూర్యతేజస్ ఎస్ (కేరళ) – AIR 1 (పేపర్ 2A ఆర్క్)
- గౌరీ శంకర్ V (కేరళ) – AIR 1 (పేపర్ 2B బిప్లానింగ్)
కాగా బీఆర్క్/బీ ప్లానింగ్కు ప్రవేశాలు కల్పించే జేఈఈ పేపర్ 2A (బీఆర్క్)కు మొత్తం 64,786 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వీరిలో 45,452 మంది అంటే 70.16 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 2B (బీ ప్లానింగ్)కు మొత్తం 32,366 మంది నమోదు చేసుకోగా.. ఇందులో 21,067 మంది అంటే 65.09 శాతం మంది హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు 99.99, ఇద్దరు విద్యార్థులు 99.98 స్కోరు సాధించారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీల్లో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
