TDPP Meeting: టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో కొత్త ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు..!
జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మంగళగిరిలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎన్నికల తర్వాత జరిగిన మొదటి సమావేశం కావడంతో మంత్రి నారా లోకేష్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
![TDPP Meeting: టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో కొత్త ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/tdpp-meeting.jpg?w=1280)
జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మంగళగిరిలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎన్నికల తర్వాత జరిగిన మొదటి సమావేశం కావడంతో మంత్రి నారా లోకేష్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.. పార్లమెంట్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వైఖరి పై అధినేత చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు.రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పార్లమెంటు సభ్యులందరూ పని చేయాలని, స్ఫూర్తిదాయకంగా నిలవాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల ప్రథమ కర్తవ్యం కావాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాలుపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకొని సభ్యులందరూ వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఈసారి లోక్ సభలో తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. దేశంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని అన్నారు.
ప్రతీ ఎంపీ కేంద్రంలో ఒక శాఖతో, అదే శాఖతో రాష్ట్రంలో కూడా సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కేంద్ర పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ఎంపీలు పని చేయాలని చంద్రబాబు అన్నారు. ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలన్నారు. వీటితో పాటుగా విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేయాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున సేంద్రీయ వ్యవసాయం నిర్వహించి ప్రోత్సహించామన్నారు. ఉపాధి హామీ కింద గతంలో రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రహదారులు నిర్మించామని, కేంద్ర పథకాలతో ఇళ్లు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రహదారలు, ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి మరింత లబ్దీ చేకూర్చేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, పొరుగు రాష్ట్రాలతో అనుసందానమై ఉన్న రహదారులు అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.
పార్లమెంట్ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
పార్లమెంట్ సభ్యులతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, పార్లమెంటరీ పార్టీ విప్గా గంటి హరీష్ ను నియమించారు. ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండటంతో మిగిలిన వారికి అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పదవులు ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…