రైళ్లలో ఆదమరిచి నిద్రపోతున్నారా..? ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త!.. కట్చేస్తే..
కంచె చేను మేసినట్లు.. రైళ్లలో ప్రయాణికులకు రక్షణ కల్పించాల్సిన రైల్వే శాఖలోనే పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి దొంగగా మారిన విస్తుపోయే సంఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూసింది. రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను అపహరిస్తున్న ఒక రైల్వే జూనియర్ ఇంజనీర్ను కర్నూలు సర్కిల్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ (RPF) సిబ్బంది సంయుక్తంగా బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను గుంతకల్ రైల్వే డీఎస్పీ శ్రీ K. శ్రీనివాసచారి మీడియాకు వెల్లడించారు.

రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బ్యాగ్ లిఫ్టింగ్కు పాల్పడుతున్న కిలేడీ దొంగను కర్నూలు రైల్వే, ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు బుధవారం ఉమ్మడిగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు ఆదోనిలో రైల్వే శాఖలోనే జూనియర్ ఇంజనీర్ (JE) గా పనిచేస్తున్న పి. బాలరాజుగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) కర్నూలు జిల్లా ఆదోనిలో రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్ (JE – Traction Distribution) గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి తరచూ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉండేది. ఈ అవకాశాన్ని బాలరాజు దుర్వినియోగం చేశాడు. రాత్రి వేళల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని వారి సీట్ల కింద ఉన్న విలువైన బ్యాగులను తస్కరించడం అలవాటుగా మార్చుకున్నాడు.
ఇటీవల నంద్యాల రైల్వే పోలీసు స్టేషన్లో ప్రయాణికులు తమ బ్యాగులు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో సీఐ ఎం. శ్రీనాథ్ రెడ్డి, డోన్ ఆర్పీఎస్ఐ సీ. బిందు మాధవి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి కర్నూలు పట్టణ శివారులోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాకయ్యారు. బ్యాగులను దొంగిలించిన అనంతరం అందులోని బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మరియు నగదును మాత్రమే తీసుకునేవాడు. ఆ తర్వాత ప్రయాణికులకు సంబంధించిన బట్టలు, ముఖ్యమైన సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు ఉన్న బ్యాగులను ఎవరికీ అనుమానం రాకుండా తగులబెట్టేవాడని విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు దొంగిలించిన ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.




