Andhra Pradesh: మాజీ మావోయిస్టుల మనసు గెలుచుకున్న ఏపీ పోలీసులు.. అల్లూరి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం..
వాళ్లంతా మాజీ మావోయిస్టులు..! దళంలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దళ సభ్యులకు సహకారం అందించి బయటకు వచ్చిన మాజీ మిలీషియా సభ్యులు కూడా ఉన్నారు.
వాళ్లంతా మాజీ మావోయిస్టులు..! దళంలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దళ సభ్యులకు సహకారం అందించి బయటకు వచ్చిన మాజీ మిలీషియా సభ్యులు కూడా ఉన్నారు. భయాన్ని పోగొట్టి.. వాళ్లపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తున్నారు పోలీసులు. లొంగిపోయిన తర్వాత వారి మానాన వారిని వదిలేయకుండా.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ వారిలో మనోస్థైర్యాన్ని నింపుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ముందస్తుగా వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ అందరితో కలిసి భోజనం చేశారు. నూతన జిల్లా ఏర్పాటు అయిన తర్వాత.. అల్లూరి జిల్లాకు ప్రధానమైన సవాళ్లు.. మావోయిస్టులు, గంజాయి.. అక్రమ రవాణా ఉంది. గంజాయి నివారణపై గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే చాలావరకు సఫలీకృతమయ్యారు. ఇక మావోయిస్టుల సమస్యపై పోలీసుల ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై చాలామంది దళ సభ్యులు, మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గతంలో పెదబయలు కోరుకొండ కమిటీలకు కార్యదర్శిగా పనిచేసిన చిక్కుడు చిన్నారావు అలియాస్ సుధీర్.. శ్రీకాంత్.. మరో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. వీరే కాకుండా దాదాపుగా 200 మంది మిలిషియా సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ క్రమంలో తమ పట్ల నమ్మకం కలిగేలా అదేవిధంగా వారిలో ధైర్యం కల్పించేలా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనం.. కలిసి భోజనం..
అల్లూరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సతీష్ కుమార్.. అటు ఆదివాసీలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. ప్రభుత్వ పథకాలతో గిరిజనుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు, మిలిషియా సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. అందరినీ పలకరిస్తూ వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు ఎస్పీ. వారితో కలిసి భోజనం చేశారు. గిరిజన ప్రజలు విద్య, వైద్యం, వ్యాపారాలలో అభివృద్ధి చెందాలని దానికి ఎటువంటి సహాయ సహకారాలైన అందించడానికి పోలీస్ శాఖ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఇటువంటి కార్యక్రమాలతో తమలో మనోధైర్యం పెరుగుతుందని మాజీ మిలీషియా సభ్యులు పేర్కొన్నారు. ఏకంగా జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు తమతో కలిసి సంబరాల్లో పాల్గొనడం, భోజనం చేయడం మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని కొనియాడుతున్నారు.
-ఖాజా, వైజాగ్, టీవీ9 రిపోర్టర్..
మరిన్ని ఏపీ వార్తల కోసం..