AP News: ఆడుదాం ఆంధ్రాలో ఆటల సంగతేమో గానీ.. కొట్లాట
ఆడుదాం ఆంధ్రాలో ఆటల సంగతేమో గానీ.. కొట్లాట మాత్రం కేక పుట్టిస్తోంది. నువ్వా నేనా సై అంటూ మీసం మెలేస్తున్న ఆటగాళ్లు కర్రలతో కసితీరా కొట్టుకుంటున్నారు. కుర్చీలను గాల్లోకి విసురుతూ సినిమా ఫైటింగ్లు చిన్నబోయేలా చేస్తున్నారు.

ఆడుదాం ఆంధ్రాలో యువకుల తన్నులాట ఇది. ఆటగాళ్ల అనాలోచిత ఆగ్రహావేశాలు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా నాగటూరు-శాతనకోట మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. చిన్న వివాదంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఇరువర్గాలు తోసేసుకున్నాయి. అంతటితో ఆగక కుర్చీలతో దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.
అటు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోనూ సేమ్ సీన్. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మండల స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ క్రమంలోనే కరగాం – రెడ్డికిపేట యువకుల మధ్య టాకిల్ పాయింట్ విషయంలో వివాదం చెలరేగింది. అదికాస్త బాహాబాహీకి దారితీసింది. ఇక్కడ కూడా పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. మొన్న చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆడుదాం ఆంధ్రాలో కూడా యువకులు గొడవపడ్డారు.
కనమనపల్లి-కాటేపల్లి గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. ఆరంభంలో అంతా ప్రశాంతంగానే సాగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కర్రలతో కుమ్మేసుకున్నారు.ఆడుదాం ఆంధ్రాలో.. క్రీడా స్ఫూర్తిని మరచి కొట్లాటకు దిగడం అందర్నీ షాక్కి గురి చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
