అరుదైన వృక్ష జాతి మొక్కకు పేరు పెట్టిన పవన్ కల్యాణ్.. దీని స్పెషల్ ఏంటో తెలుసా..?
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ "క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్" అనే పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతం సమీపంలో మాత్రమే కనిపించే ఈ మొక్క ప్రత్యేక సుగంధ ఆకులు, అరుదైన జీవ వైవిధ్య లక్షణాలతో శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది. అంతరించిపోతున్న జాతిగా గుర్తించిన ఈ మొక్క ఆవిష్కరణ తూర్పు కనుమల జీవ వైవిధ్య ప్రాధాన్యాన్ని మరోసారి చాటింది.

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు.
అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు కలిగిన ఈ మొక్క ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) పి.వి. చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతి మొక్కను గుర్తించారు. శాస్త్రీయ పరిశీలనల్లో, సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus) తో పోలిస్తే ఈ మొక్క ప్రత్యేకమైన నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

Croton Ubbalamadugensis
ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను ప్రతిబింబించడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనల ఆవశ్యకతను చాటింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణలు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపద సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
