Operation Leelavati: వనంలో పెద్ద పులి.. జనంలో పసి కూనలు.. క్షణం క్షణం ఉత్కంఠ..

వనంలో తల్లిపులి.. జనంలో దాని పసి కూనలు. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. ఇప్పుడవి కలిసేదెలా..? కలిపేదెవరు..? ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది.

Operation Leelavati: వనంలో పెద్ద పులి.. జనంలో పసి కూనలు.. క్షణం క్షణం ఉత్కంఠ..
Tiger
Follow us

|

Updated on: Mar 08, 2023 | 8:22 AM

వనంలో తల్లిపులి.. జనంలో దాని పసి కూనలు. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. ఇప్పుడవి కలిసేదెలా..? కలిపేదెవరు..? ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది. పిల్లల ప్రేమను తల్లికి అందించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో టీవీ9 టీమ్ సైతం భాగం అవుతోంది.. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామస్తులకు నాలుగు పులి కూనలు చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజులు గడిచినా తల్లి పులి రాకపోవడంతో ఈ కూనల సంరక్షణ కష్టంగా మారింది. సాధారణంగా ఒక పులి రెండు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఆ పెద్ద పులి నాలుగు ఆడ పులిపిల్లలకు జన్మనిచ్చింది. ఇది చాలా అరుదన్నారు ఫారెస్ట్ అధికారులు. మూడు రోజులు గడిచినా పెద్ద పులి జాడలేకపోవడంతో తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 70 ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ఏర్పాటు చేసి.. 200 సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ లతో కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే, మనుషులు తాకిన పిల్లలను తల్లి పులి తిరస్కరించే అవకాశం ఉందని.. జాప్యం జరిగితే కూనలను సైతం మర్చిపోయే ఛాన్స్‌ ఉందని పేర్కొంటున్నారు. దీంతో పెద్ద పులి జాడ కోసం అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పసికూనలను తల్లి పులి వద్దకు తప్పక చేరుస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లి పులి సైకాలజీ ఎలా ఉంటుంది .. అనే విషయాన్ని నిపుణులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాలుగు పులి పిల్లలు అటవీ అధికారుల సంరక్షణలోనే ఉన్నాయి. ఆత్మకూరు DFO కార్యాలయంలో పులి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అటవీ శాఖ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

అసలేం జరిగిందంటే..

నాలుగు కూనలను కన్న పులి.. ఆహారం వెతుక్కుంటూ గుమ్మాడాపురం గ్రామ సమీపంలోని అడవిలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఊరి చివరిలో ఉన్న గోదాములో ఈ పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. కుక్కలు చూస్తే వాటిని బతకనివ్వవనే భయంతో ఊళ్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అధికారులకు సమాచారమిచ్చారు. ఊళ్లోకి ధైర్యంగా పులి కూనలను తీసుకెళ్లారు స్థానికులు. కానీ వాటిని వెతుక్కుంటూ తల్లి పులి వస్తే.. అన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే తల్లి పులి ప్రస్తుతం పిల్లల జాడ కనిపెట్టే ప్రయత్నంలో ఉంటుందని.. అది దాడి చేయకపోవచ్చంటున్నారు అటవీ అధికారులు.

నీరసించిన పులి పిల్లలు..

తల్లి నుంచి విడిపోయి చాలా సమయం కావడంతో పాలులేక మూడు పిల్లలు కొంత నీరసించాయి. ఐస్‌క్రీమ్‌, సెరెలాక్‌, పాలు ముందుంచినా అవి ముట్టలేదు. పులికూనలను తల్లితో కలిపేందుకు వాటిని అడవిలోకి వదిలినా అవి కదల్లేదు. వాటిని బైర్లూటి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అటవీ అధికారులు ప్రస్తుతం వాటి అలనా పాలనా చూస్తున్నారు. ఏసీ గదిలో ఉంచి.. ప్రతీ ఆరు గంటలకోసారి నోడల్‌ అధికారి పరిశీలిస్తున్నారు. తల్లి చెంతకు పిల్లల్ని చేర్చేందుకు వేర్వేరు బృందాల సాయం తీసుకుంటున్నామన్నారు ఫీల్డ్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ లో మేము సైతం..

తల్లి పులి జాడ కనిపెట్టేందుకు ట్రాప్‌ కెమెరాలతో పాటు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పిల్లల్ని స్పెషల్ ఎన్‌క్లోజర్‌ పెట్టి తల్లి రాకను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగమైంది టీవీ9 టీమ్‌. ఫారెస్ట్ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ను టీవీలో వీక్షించవచ్చు..

మరిన్ని ఏపీ వార్తల కోసం..