AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..?

నంద్యాల జిల్లా మల్యాల గ్రామంలో అప్పుల భారం, ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక కారు డ్రైవర్ రామసుబ్బయ్య తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నలుగురినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతోంది.

కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..?
Kurnool Hopsital
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 5:07 PM

Share

ఫైనాన్స్ వేధింపులు, పెరిగిపోయిన అప్పుల భారం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అప్పుల బాధను తట్టుకోలేక భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రామసుబ్బయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, వివిధ అవసరాల కోసం చేసిన అప్పులు క్రమంగా పెరగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పులు తీర్చాలని ఫైనాన్స్ నిర్వాహకుల నుంచి వస్తున్న ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన రామసుబ్బయ్య కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.

మంగళవారం రాత్రి రామసుబ్బయ్య, అతని భార్య మాధవి, కుమార్తెలు అక్షయ, తేజేశ్వరి కలిసి పురుగుల మందు తాగారు. అయితే పరిస్థితి విషమిస్తున్న సమయంలో మాధవి తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అప్రమత్తమైన బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని నలుగురినీ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురూ అక్కడ చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక సమస్యలు, ఫైనాన్స్ వేధింపులు కుటుంబాలను ఎంతటి విషాదానికి నెడుతున్నాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వ్యవసాయ అవసరాలకు వినియోగించే కొన్ని అత్యంత ప్రమాదకరమైన పురుగుల మందులపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, అవి ఇంకా పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయించబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధిత పురుగుల మందులు సులభంగా అందుబాటులో ఉండటంతో ఇలాంటి ఆత్మహత్యాయత్నాలు చోటుచేసుకునే ప్రమాదం పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత రసాయనాల అక్రమ విక్రయాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us