Andhra Pradesh: వెంట్రుక వేస్తే.. కొండే వచ్చింది.. కానీ చివరి నిమిషంలో సడెన్ ట్విస్ట్
అతడో టైర్ల దొంగ. ఎప్పటికైనా జాక్ పాట్ తగలకపోతుందా అని అవే పాడు పనులు చేయడం కొనసాగించాడు. నిజంగా ఆ జాక్ పాట్ తగిలింది. కానీ చివరకు అతడి స్టోరీ ఊహించని టర్న్ తీసుకుంది.
Guntur District: అతనొ చిన్న దొంగ… నాలుగైదు కేసులున్నాయి. సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అయితేనేం అదృష్టం కలిసొస్తే అపార సంపద వస్తుందని.. ఏదో రోజు ఫేట్ మారిపోతుందని అవే తప్పుడు పనులు కొనసాగించాడు. కానీ చేతికాడికొచ్చిన కూడు నోటికాడికాడికి రాకుండా పోయింది. ప్రకాశం జిల్లా(Prakasam District) యద్దనపూడి(Yaddanapudi)కి చెందిన నాగరాజు లారీలు అపహరించి టైర్లు ఊడదీసి అమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పటిలాగే విజయవాడ వెళ్ళి అక్కడే ఉన్నాడు. సాయంత్రం మంగళగిరి వచ్చి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాడు. ఆ తర్వాత చేయి బాగా దురదగా ఉండటంతో జాతీయ రహదారి పైకి వచ్చాడు. కాజా టోల్ గేట్ సమీపంలోని డాబా వద్దకు వచ్చాడు. అధిక సంఖ్యలో లారీలు నిలిచి ఉన్నాయి. ఒక కంటైనర్ లారీలో తాళాలు వదిలి పెట్టినట్లు ఉండటం గమనించాడు. వెంటనే కంటైనర్ లారీని అపహరించి అమరావతి వైపు వెళ్ళాడు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తే వెంటనే పట్టుకుంటారని భావించి దొంగ దారి పట్టాడు.
అయితే ఆ కంటైనర్ ను బుక్ చేసుకుంది బ్లూడార్ట్ కొరియర్. చెన్నై నుండి భువనేశ్వర్ కు రెండు కోట్ల రూపాయల విలువ చేసే ల్యాప్ ట్యాప్ లు, మెడిసిన్స్, పాస్ పోర్టులను సదరు కంటైనర్ తరలిస్తుంది. కంటైనర్ చోరికి గురైందని తెలియటంతో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన మంగళగిరి పోలీసులకు ఆ కంటైనర్ కు GPS ఉండటంతో దాన్ని పట్టుకోవటం సులభమైంది. అత్యాధునిక సాంకేతికత ద్వారా అమరావతి వద్ద నున్న లారీని, నాగరాజును పట్టుకొని కోర్టు ముందుంచారు.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు