Shivaratri Padayatra: అడుగులన్ని శ్రీశైలం వైపే.. శివనామస్మరణతో మారుమ్రోగుతున్న నల్లమల
పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంలో బిక్కుబిక్కుంటూ కాలినడక ప్రయాణం టెన్షన్ పుట్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు అయిన నల్లమల అభయారణ్యంలో శ్రీశైలం చేరుకుని శివుడి దర్శనం కోసం సాహస యాత్ర చేస్తున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. శివస్వాములు సాధారణ భక్తుల అడుగులన్ని శ్రీశైలం కొండలవైపు పరుగెడుతున్నాయి. తండోపతండాలుగా మహాశివరాత్రి పర్వదినానికి తరలి వెళ్లాలని భక్తులు భక్తి శ్రద్ధలతో ఎండను సైతం లెక్క చేయకుండా.. వృద్దులు.. చిన్నపిల్లలు సైతం పాదయాత్రతో శివయ్య సన్నిధికి చేరుకుంటున్నారు..

కర్నూలు, ఫిబ్రవరి 23: నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా కొండలు కోనాలు దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు వెంకటాపురం నుంచి నల్లమల అడవులలొ పాదయాత్రతొ ఆకలి దప్పికను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు నడక మార్గంలో అక్కడక్కడ చెట్ల వద్ద చేదతీరుతున్నారు. మెట్ల మార్గంలో శ్రీశైలం సమీపంలోని కైలాస ద్వారం వద్దకు చేరుకుని శివలింగానికి తల తాకించి కొరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శివయ్యకు మొక్కలు తీర్చుకుంటున్నారు.
శ్రీశైం మల్లన్న భక్తులు కిలోమీటర్ల మేర కొండా కోనలు దాటుకుంటూ శ్రీశైలం సమీపంలోని కైలాసద్వారం వద్ద సేదతీరుతూ పాదయాత్ర కష్టాలన్ని శ్రీశైల మల్లన్నపై ఉంచి చేదతీరుతున్నారు. పాదయాత్రతో వచ్చే భక్తులకు దేవస్థానంతోపాటు జిల్లా అధికారులు కైలాసద్వారం, హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాట్లు చేశారు. దట్టమైన అటవీప్రాంతంలో నడక సాగించి బారీ షెడ్లలో కొంతసేపు భక్తులు సేదతీరుతూ శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు. పాదయాత్ర చేసి అలసట చెందిన భక్తులకు దేవస్థానం వైద్యం కోసం అటవీప్రాంతంలో సుమారు 10 చోట్ల వైద్యశిబిరాలు, అలానే స్వచ్ఛంద సేవకులు కాళ్ల నొప్పులకు, ఒళ్లు నొప్పులకు, కాళ్ల బొబ్బలకు మెడిసిన్ ఇచ్చి భక్తుల సేవలో తరిస్తున్నారు. పాదయాత్ర చేసి అలసిపోయి వచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవా కర్తలు భక్తుల కోసం ఉచిత బోజనాలు ఏర్పాటు చేశారు. ఆకలితో వచ్చిన భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలి బాటలో వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం అధికారులు మార్గమధ్యంలో మంచినీటి ట్యాంక్లు కైలాసద్వారం వద్ద ఏర్పాటు చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకర్లు నిరంతరం 10 ట్యాంకర్స్తో నీటి సరఫర చేస్తున్నారు.
శ్రీశైల మల్లన్న భక్తుల పాదయాత్ర నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురానికి చేరుకొని అక్కడినుండి అటవీ మార్గం ద్వారా కోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి నాగులుటి వీరభద్ర స్వామి ఆలయం, దామర్లకుంట పెద్ద చెరువు, మఠం బావి, ధూమును కొలను కైలాస ద్వారం మీదుగా సుమారు 40 కిలోమీటర్లు నల్లమల్ల అడవులను దాటుకుంటూ శ్రీశైలానికి పాదయాత్ర భక్తులు చేరుకుంటారు. అయితే పాదయాత్ర భక్తులకు నాగులుటి వద్ద ఆహారము.. దామర్లకుంట,పెద్ద చెరువు వద్ద నీటి వసతి, ఆహార వసతి కల్పిస్తున్నారు. తిరిగి మఠంభావి, భీముని కొలను, కైలాస ద్వారం వద్ద నీటి వసతి ఏర్పాట్లు అధికారులు చేశారు.
శ్రీశైల మల్లయ్య శంభో శంకర అంటూ శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో శివ భక్తులు సాధారణ భక్తులు తండోపతండాలుగా రోడ్లపై పాదయాత్ర చేస్తున్నారు. వీరంతా శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మహాశివరాత్రి ఘడియలు దగ్గర పడడంతో లక్షలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలర్పిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








