Hyderabad: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్న్యూస్.. త్వరలో మరో 2వేల ఎలక్ట్రిక్ బస్సులు!
ప్రయాణికుల రద్దీతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను కాలుష్య రహితంగా మార్చేందుకు తెలంగాణ ఆర్టీసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఒలెక్ట్రా గ్రీన్టెక్-ఈవీ ట్రాన్స్, గ్రీన్సెల్ మొబిలిటీ సంస్థలకు 2వేల బస్సులను సరఫరా చేయాలని టీజీఆర్టీసీ కోరింది.

రాష్ట్రంలోని ప్రజారవాణా వ్యవస్థను కాలుష్య రహితంగా మార్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు మహానగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఒలెక్ట్రా గ్రీన్టెక్-ఈవీ ట్రాన్స్, గ్రీన్సెల్ మొబిలిటీ సంస్థలకు 2వేల బస్సులను సరఫరా చేయాలని కోరుతూ లెటర్ ఆఫ్ అవార్డు పత్రాలపై ఆర్టీసీ సంతకాలు చేసింది. ఇక అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తైన వెంటనే ఆయా సంస్థలు కొత్త బస్సుల తయారీని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరి నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్లోపు ఈ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ కింద అన్ని రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణకు సైతం కేంద్ర ఇటీవలే 2వేల ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. వాటిలో 1,025 లోఫ్లోర్ నాన్ ఏసీ, 60 లోఫ్లోర్ ఏసీ బస్సులను తయారు చేసేందుకు కేంద్రం ఒలెక్ట్రా గ్రీన్టెక్-ఈవీ ట్రాన్స్ సంస్థకు టెండర్లు ఇవ్వగా.. 915 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సుల తయారీ కోసం గ్రీన్సెల్ మొబిలిటీకి టెండర్లు ఇచ్చింది.
అయితే నగరంలోని చాలా ప్రాంతాల్లో స్పీడ్బ్రేకర్లు పెరిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణం సాఫీగా సాగేందుకు స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయని ఆర్టీసీ ఆలోచిస్తోంది. ఇదిలా ఉండగా నగరాల్లో సేవలు అందించే బస్సులన్నీ లోప్లోర్లోనే ఉండాలని ఇటీవలే కేంద్ర రవాణా శాఖ సర్కులర్ జారీ చేసింది. దీంతో దీనిపై స్పష్టత కోరుతూ కేంద్రానికి తెలంగాణ ఆర్టీసీ లేఖ కూడా రాసింది. అందుకే కేంద్రం నిర్ణయం ప్రకారమే బస్సుల సరఫరా ఉండాలని ఆర్టీసీ కోరుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
