AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి.

Andhra News: ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..
Ap Govt
Shaik Madar Saheb
|

Updated on: Jan 31, 2025 | 7:36 AM

Share

ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడటంతో అవి మొరాయిస్తున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మార్కెట్‌ ధరలు అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటిలోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం కార్యాలయాలకు క్యూ కట్టారు. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు రద్దీ పెరిగింది. ఫలితంగా సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం వెళితే సర్వర్లు పని చేయడం లేదని జనం చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు పాత ధరలతో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ఇంకొక్క రోజే సమయం ఉండటంతో.. శుక్రవారం కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి

రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు తాకిడి పెరగడంతోనే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిసేపు ఓపెన్ అయి.. మళ్లీ వెంటనే మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ల కోసం భూముల యజమానులు, కొనుగోలుదారులు రావడంతోనే సర్వర్లు మొరాయిస్తున్నాయని.. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

మంగళవారం, బుధవారాల్లో అమావాస్య ఎఫెక్ట్

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయని కొందరు వాపోతున్నారు. అయితే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. గురువారం 100 నుంచి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయన్నది అధికారుల వాదన.

గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ప్రకటన

ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15-20 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నామని.. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇక రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..