AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పెళ్లయిన ఐదేళ్లకు ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు..

ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ తల్లి కడుపు పండింది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది.

AP News: పెళ్లయిన ఐదేళ్లకు ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు..
Triplets
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2024 | 4:58 PM

Share

ఏపీలో అరుదైన డెలివరీ జరిగింది. మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత.. ఆ దంపతులకు పిల్లలు అందడం గమనార్హం.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శారద నర్సింగ్ హోంలో ఈ అరుదైన కాన్పు జరిగింది. డాక్టర్ గిరిబాల, డాక్టర్ శ్రావ్య బృందం ఆ తల్లికి సిజేరియన్ చేసి.. ముగ్గురు పిల్లలకు పురుడు పోశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన వీరబాబు, ఆలపాటి సంధ్యా కుమారి దంపతులకు 5 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. అప్పట్నుంచి వాళ్లకి పిల్లలు కలగలేదు. వారు తిరగని గుడి లేదు.. సంప్రదించని ఆస్పత్రి లేదు. అయినా ఫలితం దక్కలేదు. రకరకాల ఆస్పత్రులకు వెళ్తున్న క్రమంలో.. రామచంద్రపురం బ్రాడీపేటలో ఉన్న శారద నర్సింగ్ హోంలో చూపించుకున్నారు. అక్కడ డాక్టర్ గిరిబాల ఇచ్చిన సూచనలు పాటించడం.. మందులు వాడటంతో.. సంధ్యా కుమారి కడుపు పండింది. తాజాగా ప్రసవ నొప్పులు రావడంతో తొలుత.. నార్మల్ డెలవరీ కోసం ట్రై చేశారు. కానీ ఇబ్బంది ఉండటంతో.. సిజేరియన్ చేసి.. ముగ్గురు పిల్లలను బయటకు తీశారు వైద్యులు. వారిలో ఇద్దరు మగపిల్లలు కాగా, ఒక ఆడపిల్ల.  తల్లీ పిల్లలు క్షేమంగానే ఉన్నారని డాక్టర్ గిరిబాల తెలిపారు. పిల్లలు ఉండాల్సిన బరువుతోనే పుట్టారని తెలిపారు. ఒక్క బిడ్డ కలిగినా చాలని.. ఎన్నో ఆశలతో ఉన్న ఆ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం కలగటంతో..  ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.

Follow Us